గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పద్మభూషణ్ అవార్డ్ను అందుకున్నారు.శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు ఆయనకు శుక్రవారం అవార్డ్ను బహూకరించారు.
ఈ కార్యక్రమానికి సుందర్ పిచాయ్ కుటుంబ సభ్యులతో పాటు భారత కాన్సుల్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా పిచాయ్ మాట్లాడుతూ.
తనకు ఈ గౌరవం కల్పించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.భారత్ తనలో భాగమన్న ఆయన.తాను ఎక్కడికెళ్లినా ఆ వారసత్వాన్ని వెంట తీసుకెళ్తానని స్పష్టం చేశారు.గూగుల్, భారత్ మధ్య వున్న భాగస్వామ్యాన్ని కొనసాగిస్తానని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.
ప్రధాని మోడీ చేపట్టిన డిజిటల్ ఇండియా.భారత్ అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన ఆకాంక్షించారు.
ఇదీ పిచాయ్ ప్రస్థానం:
పిచాయ్ జీవిత కథ అసాధారణమైంది.గూగుల్ సీఈవోగా ఆయన ఎదుగుదల అనేది అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో భారత్ అద్భుత ప్రగతికి ఒక నిదర్శనం.
తమిళనాడులోని మధురైలో 1972 జూన్ 10న జన్మించిన సుందర్ పిచాయ్ ప్రాధమిక విద్యాభ్యాసాన్ని చెన్నైలోని జవహర్ విద్యాలయలో పూర్తి చేశారు.ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తయ్యాక ఐఐటీ ఖరగ్పూర్లో చేరారు సుందర్, అనంతరం అమెరికాకు వెళ్లిన సుందర్ పిచాయ్ అక్కడి పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.2004లో గూగుల్లో చేరారు.క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ బృందానికి సారథ్యం వహించిన సుందర్.క్రోమ్ బ్రౌజర్ను అద్భుతంగా డెవలెప్ చేసి చూపించారు.2015 లో గూగుల్ సీఈఓగా ఎంపికైన సుందర్ పిచాయ్.అనంతరం దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్కు కూడా 2019 నుంచి సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇకపోతే.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సుందర్ పిచాయ్కి భారత ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్ అవార్డ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈయనతో పాటు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు కూడా పద్మ భూషణ్ అవార్డ్ను కేంద్రం ప్రకటించింది.
ఈ అత్యున్నత పురస్కారాన్ని గత నెలలో శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ నుంచి సత్యనాదెళ్ల అందుకున్నారు.