ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్గా మారిన కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీలో జగన్కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.ఇప్పటికే నియోజకవర్గంలో రెండు గ్రూపులు ఉన్నాయి.
అసలు జమ్మలమడుగు రాజకీయాలు అంటేనే కొన్నేళ్ల వరకు మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి పేర్లే వినిపించేవి.అయితే గత ఎన్నికలకు ముందు వీరిద్దరు టీడీపీలో ఉండిపోయారు.
వీరిలో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా,ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసి ఇద్దరు చిత్తుగా ఓడిపోయారు.
ఇక ఆ ఎన్నికలకు ముందు కొత్తగా జమ్మలమడుగు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు డాక్టర్ సుధీర్ రెడ్డి.
ఆయన రాజకీయాలకు కొత్తే అయినా నియోజకవర్గంలో బలమైన వర్గం అంటూ లేకపోవడంతో పాటు వ్యూహాల్లో నేర్పరి కాకపోవడంతో ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదు.దీనికి తోడు ఒంటెద్దు పోకడలు కూడా ఆయనకు మైనస్గా మారాయి.
స్థానికంగా పట్టు కోసం ఆయన ఎన్ని ఎత్తులు వేస్తున్నా అవేవి నెరవేరడం లేదు.రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వచ్చాక ఈ గ్రూపు రాజకీయాలు మరింత పేట్రేగాయి.
ఈ రెండు వర్గాల మధ్య పార్టీ అధిష్టానం ఇప్పటికే అనేక సార్లు పంచాయితీలు చేసేందుకు విఫల ప్రయత్నాలు చేసింది.ఇక ఇప్పుడు ఎమ్మెల్యేను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న వారంతా మూడో వర్గంగా ఏర్పాటు అయ్యారు.కాంట్రాక్టుల నుంచి అన్ని పనులు తమ వర్గానికి ఇవ్వడంతో పాటు పాత కేడర్ను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఎమ్మెల్యేపై తీవ్రంగా ఉన్నాయి.దీంతో వీరంతా కలిసి కొత్త కుంపట్లు రాజేస్తున్నారని సమాచారం.
విచిత్రం ఏంటంటే సుధీర్రెడ్డి బంధువులు కూడా ఈ కొత్త వర్గంలో ఉన్నారట.ఇప్పటికే రామసుబ్బారెడ్డి వర్సెస్ సుధీర్రెడ్డి మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది.
ఇప్పుడు మూడో గ్రూఫ్ అంటే జమ్మలమడుగులో జగన్కు మరిన్ని తలనొప్పులు తప్పేలా లేవు.