వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంపై ఎంతో పట్టు ఉంది.పైగా వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
కానీ పార్టీలోని అంతర్గత ఆధిపత్య పోరు మాత్రం కొద్ది మంది నాయకులను పునరాలోచనలో పడేసింది.ముఖ్యంగా జనసేన-తెలుగుదేశం పార్టీల పొత్తు విషయం తలుచుకుంటే వారి ఆలోచనలను అర్థం చేసుకోవచ్చు.
క్రితం సారి ఎన్నికల్లో వైసీపీ నుండి రాజోలులో పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు తృటిలో విజయాన్ని కోల్పోయారు.అయితే అక్కడ గెలిచిన ఏకైక జనసేన అభ్యర్థి మాత్రం జగన్ కు జై కొట్టడంతో ఈయన జనసేన లో చేరిపోయి లెక్క సరిచేశారు.
అయితే ఇతని బాట పట్టేందుకు ఎంతో మంది కోస్తా, ఉత్తరాంధ్ర నాయకులు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలకు సరిగ్గా నాలుగైదు నెలల ముందు జనసేన పార్టీలో చేరేందుకు వీరంతా సన్నాహాలు చేస్తున్నారట.
ముందస్తు చర్యలుగా అనుచరులను గుట్టుగా పంపించి వారి సీటుపై కర్చీఫ్ వేసుకున్నట్లు సమాచారం.మరి ముందే బయటపడితే అధికార పార్టీ వేధింపులకు ఎవరు సిద్ధపడతారు అని అంటున్నారు కేడర్.
ఇంకా లోతుగా వెళ్తే వైసీపీ నుండి గురాన అయ్యలు కూడా జనసేనలో చేరారు .గతంలో ప్రజారాజ్యం పార్టీ లో ఉన్న గురాన ఒక పెద్ద పారిశ్రామికవేత్త.అయితే అయ్యలు వైసీపీని వీడి జనసేనలో చేరడం వెనుక ఎన్నో లెక్కలు ఉన్నాయి.ఇక అతనిలాగే గన్నవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరు కొండలరావు కూడా పదవిలో ఉండగానే జనసేనలో చేరడం గమనార్హం.
ఇలాంటి పెద్ద నేతల దారిలోనే మిగిలిన ఉత్తరాంధ్ర నేతలు కూడా పయనిస్తున్నారట.అదీకాక అమరావతి ప్రాంతంలో ఉండే నాయకులు వైసీపీలో చేరితే తమకు ఒరిగేది ఏదీ లేదంటూ… జనసేన అయితే వెసులుబాటుగా అసెంబ్లీ సీటు లేదా ఇతర పదవులు తగ్గే అవకాశం ఉందని అటు వెళ్తున్నారట.ప్రస్తుతానికి ఈ గాలి చిన్నగానే వీస్తున్నా… రాబోయే రోజుల్లో తుఫానుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.