నల్గొండ జిల్లా మునుగోడులో త్వరలో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో.అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది.
స్థానిక నేతగా ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది.ఈ నిర్ణయాన్ని మునుగోడులో జరగనున్న టీఆర్ఎస్ బహిరంగ సభలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించనున్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మునుగోడు నుంచి కూసుకుంట్ల బరిలోకి దిగారు.కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు.
తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు కూసుకుంట్ల.
ఆయనపై పార్టీ అధిష్ఠానానికి పెద్దగా వ్యతిరేకత లేకున్నా… స్థానిక నాయకత్వం మాత్రం వ్యతిరేకంగానే ఉంది.ఈ క్రమంలోనే కూసుకుంట్లకు టికెట్ ఇస్తే పార్టీ విజయం కోసం పనిచేయమని స్థానిక నేతలు చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కూసుకుంట్లకే మునుగోడు టికెట్ ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది.