రాష్ట్రంలో ఉప ఎన్నికలతో రాజకీయాల్లో కీలక మార్పులు చేసుకుంటున్నాయి.గతంలో హుజురాబాద్, దుబ్బాక ఎన్నికలే అందుకు నిదర్శనం.
ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగిన మూడు ఉప ఎన్నికల తర్వాత బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది.ఈ నేపథ్యంలో ఇప్పుడు త్వరలోనే జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా రాజకీయాలను నిర్దేశించనున్నాయా.
అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.పలు పార్టీల్లోని అసంతృప్త నేతలు తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ ఎన్నికలనే ప్రామాణికంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు తమ భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారట.ఈ క్రమంలోనే మునుగోడు ఎన్నికల అనంతరం ప్రజాతీర్పు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
అధికార పార్టీ ఖమ్మం జిల్లాలో

ఇప్పటికే కొందరు అసంతృప్త నేతలు ఈ విషయమై దృష్టి సారించినట్లు సమాచారం.అధికార టీఆర్ఎస్లో టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య అధికంగానే ఉంది.పార్టీలో టికెట్లు ఆశిస్తున్న వారితోపాటు ఇతర నాయకులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల వ్యవహార శైలితో అసంతృప్తితో ఉన్న నేతలు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నా ఉప ఎన్నిక ఫలితాల తర్వాత జోరు పెంచనున్నట్లు తెలుస్తోంది.దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ అధికార పార్టీలో రెండేసి వర్గాలు ఉన్నాయని అంటున్నారు.
కొందరు నేతలు బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా, సత్తుపల్లి, ఇల్లెందు, పినపాక వంటి నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉందంటున్నారు.
ఈ పరిణామాల క్రమంలోనే కొందరు నేతలు తమ దారి తాము చూసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట.మునుగోడు ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ లో భారీ కుదుపులు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ జిల్లాలో పుంజుకోవాలంటే చెప్పుకోదగిన రీతిలో స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది.అయితే ఈ పార్టీలో కూడా అంతర్గతంగా అసంతృప్తి రగులుతోందంటున్నారు.
ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే శక్తియుక్తులు కలిగిన నేతల అవసరం ఉండగా… ప్రజావ్యతిరేక చర్యలపై నిరసనలు తెలుపుతున్నా నాయకులు ఏకతాటిపైకి రావడం లేదని అంటున్నారు.దీంతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కావాలంటే మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఫలితాలే ప్రామాణికమని అంటున్నారు.