గత కొద్ది రోజులుగా ఎలక్ట్రిక్ వాహనాలు అన్ని విధాలా చెడ్డపేరును మూటగట్టుకున్నాయి.బ్యాటరీ లోపాలతో కాలిపోవటం, ఆటోమేటిక్ గా వెనక్కి వెళ్లడం, ఇంకా అనేక సమస్యలతో వరస్ట్ వెహికల్స్ గా ఎలక్ట్రిక్ స్కూటర్లు అవతరిస్తున్నాయి.
సరేనా టెస్టింగ్ లేకుండా బైక్స్ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ కంపెనీలు కూడా తీవ్ర విమర్శల పాలవుతున్నారు.నిజానికి ఈ కంపెనీలు తమ కస్టమర్ కేర్ ఏదైనా సమస్య వస్తే తీర్చే సోయి కూడా లేకుండా ప్రవర్తిస్తున్నాయి.
అందుకే వాహనదారుల్లో విపరీతమైన అసహనం పెరుగుతోంది.అయితే తాజాగా ఒక వ్యక్తిలో మాత్రం అసహనం తారాస్థాయికి చేరుకుంది.
దాంతో అతడు లక్షలు పోసి కొనుగోలు చేసిన తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను తగులబెట్టాడు.
వివరాల్లోకి వెళితే.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన డాక్టర్ పృథ్వీరాజ్ మూడు నెలల క్రితం ఓలా ఎస్-1 ప్రో (Ola S1 Pro) కొనుగోలు చేశాడు.అయితే కంపెనీ చెప్పినట్టుగా ఈ స్కూటర్ మైలేజ్ అందించడం లేదట.
అలాగే దీని పనితీరు చాలా పేలవంగా ఉండటంతో పాటు తరచూ రిపేర్ కి వస్తోందట.ఈ సమస్యను ఓలా కంపెనీ దృష్టికి తీసుకెళ్లినా అటువైపునుంచి కనీస స్పందన కూడా కరువయిందట.
దీనితో ఈ రిపేర్ ఖర్చులను భరించలేక ఓనర్ తన స్కూటర్ను తగులబెట్టాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

మొదట్లో ఓలా సపోర్టు సిబ్బంది ఈ డాక్టర్ కొనుగోలు చేసిన స్కూటర్ని పరిశీలించి, ఇది మంచి వర్కింగ్ ఆర్డర్లో ఉందని చెప్పారట.కానీ మైలేజ్ విషయంలో మాత్రం స్కూటర్ సక్రమంగా పని చేయలేదని డాక్టర్ తెలిపారు.సింగిల్ ఛార్జ్ పై 181 కిలోమీటర్లు వస్తుందని కంపెనీ చెప్పినట్లుగా మైలేజ్ రావడం లేదని అతను అన్నారు.ఒకరోజు కేవలం 44 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత అతని స్కూటర్ ఆగిపోయిందట.180 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేయొచ్చు అనుకున్న ఆ వ్యక్తికి దీంతో దిమ్మ తిరిగినంత పని అయిందట.ఈ కోపంతోనే అతను స్కూటర్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఈ ఘటన తమిళనాడులోని అంబూర్ బైపాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది.







