2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర నుంచి వైసిపి కి అనుకూలంగానే అన్ని ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.ఎప్పటికప్పుడు వైసిపి పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని , టీడీపీ బాగా బలం పుంజుకొంది అంటూ టిడిపి అదేపనిగా ప్రచారం చేస్తున్నా, వాస్తవంలోకి వచ్చేసరికి పరిస్థితులు వైసిపి అనుకూలంగానే ఉంటున్నాయి.
సార్వత్రిక ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పిటిసి ఇలా అన్ని చోట్ల ఫ్యాను గాలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, ఇక ఆ పార్టీ పని అయిపోయిందని, మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తుందని, ఇలా రకరకాలుగా పార్టీ నాయకుల్లో ఉత్సాహం పెంచేందుకు చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, అవన్నీ వృధాగానే మారిపోయినట్టు గా కనిపిస్తున్నాయి.
జగన్ పని అయిపోయిందని , ఇక ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు అని ఎప్పటి నుంచో చంద్రబాబు హడావుడి చేస్తూనే వస్తున్నారు.కానీ దానికి తగ్గట్టుగా వాస్తవ పరిస్థితి ఉండకపోవడం, ప్రతి ఎన్నికల్లోనూ టిడిపి ఘోర పరాజయం అవుతుండడం, ఇవన్నీ ఆ పార్టీ నాయకుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నాయి.
పంచాయతీ, మున్సిపల్ , లోక్ సభ ఉప ఎన్నికలు, ఇలా ఏ ఎన్నిక అయినా పరిస్థితి మాత్రం టీడీపీ కి అనుకూలంగా ఉండడం లేదు.ఈ పరిణామాలతో తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం మారిపోయింది.
టీడీపీకి రాజకీయ భవిష్యత్తు కష్టమని, ఎంతగా ప్రజల బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేసినా, అవన్నీ నిరుపయోగమైనవే అని జగన్ హవా ముందు ముందు కూడా కొనసాగుతుందని మెజార్టీ టిడిపి నాయకులు నమ్ముతున్నారు.
ఈ క్రమంలోనే వారు సమయం చూసుకుని వైసీపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన టిడిపి నాయకులు ఇక ఈ ప్రాంతంలో తమ పార్టీకి భవిష్యత్తు ఉండదని, పార్టీ పుంజుకుంటుందని ఎప్పటికప్పుడు భావిస్తున్నా, ఆ పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయం తో వైసీపీ లోకి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారట.కేవలం రాయలసీమలోనే కాకుండా, మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ తెలుగు తమ్ముళ్ల లో ఇదే రకమైన అభిప్రాయం లో ఉండడం తో వలసలపై టీడీపీ లో ఆందోళన నెలకొంది.