ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.జనసేనతో పొత్తు ఖరారు అయ్యే అవకాశాలు ఉండడంతో పాటు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర ద్వారా పార్టీకి జనాల్లో ఆదరణ పెరుగుతుందని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు.
కచ్చితంగా 2024 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని బాబు అంచనా వేస్తున్నారు.అందుకే ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు .అయితే చాలా నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులు తెరపైకి వస్తున్నారు.2024 ఎన్నికల్లో టిడిపి తరఫున యువ నాయకులకు ఎక్కువగా అవకాశం ఇస్తామంటూ గతంలో చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు దానిని అమల్లోకి తీసుకువస్తున్నారు.అయితే వీరిలో ఎక్కువగా ఎన్నారైలు ఉండడం ఆసక్తి రేపుతోంది.
టిడిపి తరఫున పెద్ద ఎత్తున ఎన్నారైలు 2024 లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.ఇప్పటికే కొంతమంది పేర్లను బాబు ప్రకటించారు.అయితే ఈ ఎన్నారైల ప్రభావం పార్టీలో పెరుగుతుండడంపై టిడిపిలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
ఆర్థికంగా టిడిపి ఇబ్బందుల్లో ఉందని , 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చినా, కేంద్రంతో ఏర్పడిన విభేదాలు కారణంగా పార్టీకి పెద్దగా నిధులు సమకూరలేదని , 2019 ఎన్నికల్లో భారీగా సొమ్ములు పార్టీ తరఫున ఎన్నికల్లో ఖర్చు పెట్టాల్సి వచ్చిందని బాబు అభిప్రాయపడుతున్నారు.ఇక ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏపీ లో అధికారంలో ఉండడంతో , టీడీపీకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే వారి సంఖ్య బాగా తగ్గిపోవడం, వంటివి చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలిచేందుకు భారీగానే సొమ్ములు ఖర్చు పెట్టాల్సి ఉండడంతో బాబు ముందుగానే అలర్ట్ అవుతున్నారు.దీనిలో భాగంగానే చాలా నియోజకవర్గాల్లో ఎన్నారై లకు అవకాశం ఇవ్వాలని బాబు నిర్ణయించుకున్నారు.
కొత్తవారు అయితే డబ్బులు బాగా ఖర్చు పెడతారని , గెలుపు కోసం ఎంత సొమ్ము అయినా వెచ్చించేందుకు వెనకాడారని, పార్టీ ఇచ్చే నిధులు కోసం ఎదురు చూడరు అని బాబు నమ్ముతున్నారు.అందుకే 40 శాతం యువత కోటాలో ఎన్నారై లను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటి నుంచే పోటీ చేయబోయే ఎన్నారై అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ద్వారా, వారంతా పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తారని, ఆర్థికంగా పార్టీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవని బాబు బలంగా నమ్ముతున్నారట.