ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవాలన్న ఉద్ధేశంతో రష్యా సాగిస్తోన్న దండయాత్ర అక్కడ రక్తపుటేరులు పారిస్తోంది.ఈ కారణంగా ఉక్రెయిన్లో భీతావహ పరిస్ధితులు నెలకొన్నాయి.
యుద్ధం వల్ల అక్కడ చిక్కుకుపోయిన లక్షలాది మంది విదేశీ విద్యార్ధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.భారత్ సహా పలు దేశాలు ప్రత్యేక విమానాల ద్వారా తమ పౌరులను స్వదేశానికి రప్పిస్తున్నాయి.
ఇదే సమయంలో స్వచ్ఛంద సంస్థలు సైతం శరణార్ధులకు, అంతర్జాతీయ విద్యార్ధులకు అండగా నిలుస్తున్నాయి.ఇందులో భారతీయ సంస్థలు కూడా వున్నాయి.
హ్యూస్టన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ‘‘సేవా ఇంటర్నేషనల్ ’’ సంస్థ ఉక్రెయిన్లో సంక్షోభం వేళ అభాగ్యులకు అండగా నిలుస్తోంది.
ఉక్రెయిన్లోని సుమీ నుంచి 367 మంది నైజీరియన్లతో సహా 467 మంది ఆఫ్రికన్ విద్యార్ధులను తరలించడంలో సేవా ఇంటర్నేషనల్ సాయం చేసింది.
ఉక్రెయిన్లోని నైజీరియా రాయబారి షీనా అలేజ్ అభ్యర్ధనకు ప్రతిస్పందిస్తూ సేవా వాలంటీర్లు తరలింపు ప్రయత్నాలను సమన్వయం చేశారని సంస్థ పేర్కొంది.ఈ సందర్భంగా నైజీరియా విదేశాంగ శాఖ మంత్రి జియోఫ్రీ ఒనీమా.
సేవా ఇంటర్నేషనల్ యూరప్కు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే తమ విద్యార్ధులకు బస్సులను ఏర్పాటు చేసినందుకు ఉక్రెయిన్ ప్రభుత్వానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన ప్రజలకు సహాయం చేయడానికి సేవా ఇంటర్నేషనల్ యూరప్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.367 మంది నైజీరియన్లు, నమీబియా, జాంబియా, దక్షిణాఫ్రికాలకు చెందిన 100 మంది ఆఫ్రికన్ విద్యార్ధులను సుమీ నుంచి మంగళవారం తరలించినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.అంబాసిడర్ నుంచి మార్చి 5న వచ్చిన అభ్యర్ధనను స్వీకరించిన సేవా యూరప్ వాలంటీర్లు.సుమీ స్టేట్ యూనివర్సిటీ కో ఆర్డినేటర్లు, సుమీ సిటీ అడ్మినిస్ట్రేషన్, నైజీరియన్ విద్యార్ధి ప్రతినిధి మోసెస్ ఫెహింటోలాతో కలిసి పనిచేశారు.
కాగా.ఉక్రెయిన్లో 100 మందికి పైగా సేవా వాలంటీర్లు పనిచేస్తున్నారు.
వీరిలో 50 మంది ప్రజలు సరిహద్దులు దాటేందుకు సాయం చేస్తున్నారు.ఇప్పటి వరకు 12 దేశాలకు చెందిన ప్రజలు ఉక్రెయిన్ దాటేందుకు సేవా ఇంటర్నేషనల్ సాయపడింది.







