యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూర్(ఎం)మండల( Athmakur (M) ) పరిధిలో మోత్కూరు నుండి జిల్లా కేంద్రం భువనగిరి వరకు, తుక్కాపురం స్టేజి నుండి కాప్రాయపల్లి స్టేజి వరకు వెళ్ళే ప్రధాన రహదారులు అత్యంత అధ్వాన్నంగా తయారై,పెద్ద పెద్ద గుంతలతో ప్రమాదకరంగా మారి,ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రజలు, ప్రయాణికులు,వాహనదారులు వాపోతున్నారు.
ఈ రహదారి గుండా మూడు జిల్లాలకు చెందిన మోత్కూరు,తిరుమలగిరి, తొర్రూరు( Thorrur ),తుంగతుర్తి తదితర ప్రాంతాల నుండి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది.
ఈ రహదారులపై ప్రతినిత్యం ఆర్టీసీతో పాటు లారీలు, ఆటోలు,ప్రైవేట్ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.రాత్రి వేళలో రాకపోకలైతే మరింత ప్రమాదకరంగా మారాయని వాహన శోధకులు,రాత్రి వేళలో ఈ రహదారులపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళాల్సిందేనని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత పాలకులకు ఎన్నిసార్లు విన్నపాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని, ఇప్పటికైనా ఈ నరకం నుండి మోక్షం లభించేనా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.ఇన్నాళ్లు ఎన్నికల విధుల్లో ఉన్న యంత్రాంగం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరమ్మత్తులపై దృష్టి సారించాలని కోరుతున్నారు.