తెలుగు రాష్ట్రాల్లో పలు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమనుకుంటే ఇప్పటినుంచే పక్క చూపులు చూస్తున్నారట.అసంతృప్తి ఉన్నా.
హైకమాండ్ సర్వేల్లో పాజిటివ్ గా లేకున్నా.ఎలాగూ టికెట్ దక్కదని భావిస్తున్న నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారట.
ప్రస్తుతం ఏపీలో ఓ వైసీపీ ఎమ్మెల్యే టీడపీలోకి జంప్ కావడానికి ప్రయత్నిస్తున్నారట.ఏపీలోని రాయచోటి జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఈసారి టీడీపీ వైపు చూస్తున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి.
మేడా 2014లో టీడీపీ నుంచి రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు.అయితే గత ఎన్నికల ముందు వైసీపీలో చేరి రెండో సారి విజయం సాధించారు.
ఇప్పుడు మళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు.వాస్తవానికి రాజంపేటలో బలిజల జనాభా ఎక్కువ.
గతంలో వివిధ పార్టీల తరఫున బలిజలే అత్యధిక సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.గత ఎన్నికల్లో మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీకి షాక్ ఇవ్వడంతో టీడీపీ బలిజ సామాజికవర్గం నుంచి బత్యాల చెంగల్రాయుడుకి సీటు ఇచ్చింది.అయితే ఆయన ఓడిపోయారు.
జిల్లా ఏర్పాటు చేయలేదని…?
కాగా ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.దీని ప్రకారం పార్లమెంటరీ నియోజకవర్గంగా ఉన్న రాజంపేట జిల్లా అవ్వాల్సి ఉంది.అయితే జగన్ ప్రభుత్వం రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా చేసింది.రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు నిర్వహించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డితోపాటు ఆ పార్టీ నేతలు కూడా రాజంపేటను జిల్లా చేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు.
దీంతో అప్పటి నుంచి మేడా మల్లికార్జునరెడ్డి అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు.వాస్తవానికి జిల్లా ఏర్పాటుకు ఆందోళనలు చేసినప్పుడే ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే పదవికి.వైసీపీకి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి.
అయితే రాజీనామా చేయకుండా సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.ఈ క్రమంలోనే టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు.

టీడీపీకి ఆసక్తి లేదట.!
అయితే ట్విస్ట్ ఏంటంటే ఈసారి టీడీపీ జంపింగ్ లకు తావివ్వదని అంటున్నారు.మరోసారి బలిజ సామాజికవర్గానికే చోటు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.లేదా టీడీపీ జనసేన పొత్తులో పోటీ చేసినా ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు.
రాజంపేటలో బలిజల జనాభా ఎక్కువ.ఈ నేపథ్యంలో ఇక్కడ జనసేన పార్టీపై కూడా ఆదరణ కనిపిస్తోందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో పొత్తు ఉంటే జనసేనకు.లేదంటే టీడీపీ పోటీ చేస్తుందని సమాచారం.
మరోవిషయం ఏంటంటే ఎవరు పోటీ చేసినా బలిజలకే సీటు ఇస్తారని సమాచారం.ఇక వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తారని చెబుతున్నారు.
లేదంటే మరెవరైనా కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతారని.ఈ సారి మహిళకు చాన్స్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది.