రాజకీయ సభలు అంటే పైసలు, ముక్క, సుక్క కుమ్మరించాల్సిందేనా ? అంటే అవుననే చెప్పాలి.పైసలు లేకుండా పార్టీ బహిరంగ సభలు నిర్వహించడం ప్రస్తుతం కత్తిమీద సాములాంటిదే.
ఇలాంటి తరుణంలో ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా, తాయిలాలు ఇవ్వకుండా సభకు భారీగా జనం వస్తే.సభ సక్సెస్ అయితే….
ఇది సంచలనమే అనక మానరు.మొన్న జనసేన ఆవిర్భావ సభ కూడా ఇలానే సక్సెస్ అయి సంచలనంగా మారింది.
సభకు కనీసం వాహనాలు కూడా ఏర్పాటు చేయలేదు.అయినా జనాలు భారీగా తరలివచ్చారు.
ఇది చూసిన వాళ్లంతా నోరెళ్లబెట్టిన పరిస్థితి నెలకొంది.రాజకీయాల్లో పవన్ చరిత్ర తిరగరాశారని జనసైనికులు పేర్కొంటున్నారు.
అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు నిర్వహించే బహిరంగ సభలకు తరలింపు కార్యక్రమాలు చేపట్టడం, కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం పరిపాటిగా మారింది.ఇందుకు సమర్ధవంతమైన నేతలను ఎంపిక చేసి వ్యూహాలతో సభ విజయవంతం చేయడం చూసి ఉంటాం.
కానీ, ఇందుకు భిన్నంగా జనసేన ఆవిర్భావ సభ సక్సెస్ కావడం ఆలోచింపజేస్తోంది.సభకు హాజరైన జనంను చూస్తే పవన్ క్రేజ్ ఏంటనేది స్పష్టం అవుతుంది.కాగా టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారిందని చెప్పుకునే కేసీఆర్ . ఇందుకు తగ్గట్టుగా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.కానీ, పవన్ మాత్రం అలాంటి వాటి ఊసే ఎత్తడం లేదు.సైద్ధాంతిక భావాలను మాటలతోనే కాకుండా చేతల్లో చూపించడం జనసేనాని స్టైల్.ఇతర పార్టీలు మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఒరగబెట్టేదేమీ ఉండదు.అయితే పవన్ మాత్రం తాను పోటీ చేసిన నియోజకవర్గంలో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా ఓట్లు అభ్యర్థించారు.
ఫైనల్గా ఫలితం ఎలా ఉందో మనకు తెలిసిందే.

ఇక తాజాగా నిర్వహించిన ఆవిర్భావ సభ విషయానికొస్తే కనీసం రూ.10కోట్ల నుంచి రూ.15 కోట్ల దాకా సభ ఖర్చు చేయాల్సి ఉంటుందని, జనసమీకరణకు పేరుమోసిన నేతలు కష్టపడితే కానీ జనం రారని అందరూ ఊహించారు.జనసేన విషయంలో పవన్, నాదెండ్ల మనోహర్ తప్ప చెప్పుకోదగిన వారెవరూ లేరు.అయినా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం.అది భారీ గా విజయవంతం కావడం చరిత్ర అనే చెప్పాలి.దీనిని పవన్ రాజకీయ ప్రత్యర్థులు సైతం ఒప్పుకోవడం అన్నిటికంటే పెద్ద విజయమే అవుతుంది.







