కంటికి కనిపించి కనిపించకుండా దాడి చేసే జీవి దోమ.ఎప్పుడు కుడుతుందో తెలియదు కానీ కుట్టిన వెంటనే దాన్ని చంపే వరకూ మనకు మనఃశాంతి ఉండదు.దోమల బెడదతో ఇబ్బంది పడని మనిషి ఉంటాడా చెప్పండి.ఇవి కుట్టకుండా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం.గ్రామాలలో వీటిని నివారించేందుకు ప్రభుత్వం పలు రకాల చర్యలు కూడా చేపడుతుంది.అయినా సరే వాటి పని వాటిదే అనుకోండి.
అసలు దోమలు లేకుండా పూర్తిగా వాటిని నివారించడం ఎలా వాటిని సంతతిని నిర్మూలించడం ఎలా…ఈ దిశగా పరిశోధనలు చేపట్టిన అమెరికాలోని ఆక్సీటెక్ కంపెనీ వినూత్న పద్దనిని దోమలపై ప్రయోగించడానికి సిద్దమయ్యింది.
దోమలను నివారించేందుకు కోట్లాది దోమలను వదలడమే ఇందుకు పరిష్కారమని పరిశోధించి ప్రయోగం ద్వారా పరిశీలించి విజయం సాధించింది.
ఇప్పుడు ఈ ప్రయోగాన్ని కాలిఫోర్నియా స్టేట్ లో ప్రవేశపెట్టనుంది.ఇంతకీ ఏమిటా పరిశోధన, దోమలను నివారించడానికి కోట్లాది దోమలను విడిచి పెడితే మనుషులను కుట్టవా ఇదేం బుర్ర తక్కువ పని అనుకోకండి.
అసలు విషయం ఏంటంటే.

ఆక్సీటెక్ కాలిఫోర్నియా రాష్ట్రంలో విడిచి పెట్టాలనుకుంటున్న దోమలు జన్యు మార్పిడి చేయబడిన దోమలు అంటే మగ దోమలు.ఇవి కోట్లాది సంఖ్యలో వారి వద్ద ఉన్నాయట.వీటిని కాలిఫోర్నియా రాష్ట్రంలో విడిచి పెట్టిన తరువాత ఇవి ఆడ దోమలతో కలిసినప్పుడు వీటిలో ప్రవేశపెట్టిన ప్రత్యేకమైన ప్రోటీన్ కేవలం మగ దోమలను మాత్రమే జన్మనిచ్చేలా రూపొందించబడింది.
ఫలితంగా భవిష్యత్తులో ఈ ఆడ దోమలు కేవలం మగ దోమలకు మాత్రమే జన్మను ఇవ్వడంతో క్రమం క్రమంగా వీటి జాతి అంతరిస్తుందని ఆక్సీటెక్ కంపెనీ వెల్లడించింది.అయితే సదరు కంపెనీ చేస్తున్న ప్రయోగం మాపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతుందోనని తమకు ఆందోళనగా ఉందని ఈ కంపెనీ ప్రయోగాలను తమపై చేయడానికి తాము ఏ మాత్రం ఒప్పుకునేంది లేదని స్థానిక ప్రజలు నిరసనలు చేపడుతున్నారు.
కాగా ఈ ప్రయోగం పూర్తిగా దోమలపై మాత్రమే జరుగుతుందని ఎలాంటి ప్రభావం మనుషులపై ఉండదని కంపెనీ సీఈఓ స్పష్టం చేస్తున్నా సరే స్థానిక ప్రజలు మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు.







