తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయులు స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు అక్కడి మేయర్ అంగీకారం తెలిపారు.
అన్నగారి శత జయంతి వేడుకల సందర్భంగా సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రతిపాదనపై ప్రముఖ సినీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ చొరవ తీసుకున్నారు.సాధారణంగా అమెరికాలోని మెజారిటీ తెలుగువారు తమ ప్రయాణాన్ని ఎడిసన్ సిటీ నుంచే ప్రారంభిస్తారు.
దీనికి దగ్గరలోని న్యూయార్క్ నగరంలోనూ చాలా మంది తెలుగువారు పనిచేస్తున్నారు.
ఎడిసన్ మేయర్ సామ్ జోషి .ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సంబంధించిన ప్రతిపాదనను సమీక్షించిన తర్వాత వెంటనే ఆమోదం తెలిపారు.ఇందుకు అవసరమైన స్థలాన్ని అన్వేషించాల్సిందిగా సామ్ జోషి అధికారులను ఆదేశించారు.
దీంతో సాకేత చదలవాడ, ఉజ్వల్ కుమార్ కస్తాలాలు స్థలాన్ని అన్వేషించేందుకు కృషి చేస్తున్నారు.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బహిరంగంగా ఏర్పాటు కానున్న ఎన్టీఆర్ తొలి విగ్రహం ఇదే కావడం విశేషం.
ఇది భారతీయులకు, తెలుగు ప్రజలకు గర్వ కారణం.NASAA (నార్త్ అమెరికన్ సీమ ఆంధ్రా అసోసియేషన్) ఈ విగ్రహ ఏర్పాటుకు నిధులు సమకూరుస్తోంది.
ఈ సంస్థతో పాటు ఎడిసిన్, అమెరికా వ్యాప్తంగా వున్న పలు తెలుగు సంఘాలు, తెలుగు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.ఎన్టీఆర్ తెలుగువారిని ప్రపంచ పటంలో నిలబెట్టారని పేర్కొన్నారు.ఇప్పుడు ప్రతి తెలుగువాడు శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు.
తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం తెలుసుకోవడానికి, తెలుగు సినిమా వైభవాన్ని చాటిచెప్పడంలో ఇది ఒక మెట్టని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
.