ఎట్టి పరిస్థితుల్లోనూ మనుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.తమతో కలిసి వచ్చే పార్టీలు ఏమున్నాయి అనే విషయంపై ఆరా తీస్తున్నాయి.
టిఆర్ఎస్, బిజెపిలపై అసంతృప్తితో ఉన్న చిన్నా చితక పార్టీలను సైతం తమదారికి తెచ్చుకుంటూ ఈ ఎన్నికల్లో సులువుగా విజయం సాధించవచ్చనే లెక్కల్లో ఉంది.ఇప్పటికే తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోగా, మరికొన్ని పార్టీల మద్దతును ప్రత్యక్షంగా పొందేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కమ్యూనిస్టు పార్టీల మద్దతు పొందేందుకు కాంగ్రెస్ ఇప్పుడు రంగంలోకి దిగింది.కమ్యూనిస్టు పార్టీలతో పాటు , ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలోని టీజేఎస్ పార్టీ మద్దతు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కమ్యూనిస్టు టీజేఎస్ పార్టీల మద్దతు కోరుతూ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు.టిఆర్ఎస్ ను ఓడించాలంటే తమకు మద్దతు పలకాలని ఆయన కోరారు.
మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో , గెలుపు అనుకున్నంత కష్టమేమీ కాదు అనే లెక్కల్లో కాంగ్రెస్ ఉంది.బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడం ద్వారా, ఇక్కడ విజయం సొంతం చేసుకోవచ్చనే లెక్కలు వేసుకుంటుంది.
టిఆర్ఎస్ బిజెపిలు ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తో పాటు, భారీ స్థాయిలో సొమ్ములు ఖర్చు పెట్టైనా గెలవాలనే ప్రయత్నాల్లో ఉండడంతో ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం ప్రజల్లోకి కాంగ్రెస్ ను తీసుకువెళ్లి టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టి ప్రజల్లో వ్యతిరేకత పెంచాలని ప్లాన్ చేసుకుంటుంది.దీంతోపాటు టిఆర్ఎస్ , బిజెపిలోని అసంతృప్తి నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా తమ అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చనే లెక్కల్లో కాంగ్రెస్ ఉంది.అందుకే ఇతర పార్టీల మద్దతు కోసం ఇంతగా ప్రయత్నాలు చేస్తోంది.