2024 ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో అనేక సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగాయి.ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపి( TDP ) గెలిచే అవకాశం లేదని, మళ్లీ వైసీపీని అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో సవాళ్లు విసిరిన వైసిపి నేతలకు ఎన్నికల ఫలితాలు తర్వాత ఆ సవాళ్లే ఇబ్బందికరంగా మారాయి.
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా( Mudragada Padmanabha Reddy ) మార్చుకుంటానంటూ మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.కానీ ముద్రగడ ఊహించినదానికంటే ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి అధికారంలోకి రావడం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) భారీ మెజారిటీతో గెలవడంతో ముద్రగడ పద్మనాభం చేసిన సవాల్ కు కట్టుబడి తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.

ఈ మేరకు ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది.ముద్రగడ తన సవాల్ ను నెరవేర్చడంతో, వైసిపిలోని మరో ముగ్గురు నేతలు ఇరకాటంలో పడ్డారు .టిడిపి ఏపీలో అధికారంలోకి వస్తే చంద్రబాబు బూట్లు తుడుస్తానంటూ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ) ఎన్నికలకు ముందు సవాల్ చేశారు.ఇక గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి( Kasu Mahesh Reddy ) కూడా అదే విధంగా సవాల్ చేశారు టిడిపి అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ప్రకటించారు.

ఇక మాజీ మంత్రి ఇటీవల ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) కూడా పల్నాడులో టిడిపి గెలిస్తే రాజకీయాలు వదిలేస్తానంటూ సవాల్ చేశారు.ఇప్పుడు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చుకుని ఆ సవాల్ కు కట్టుబడి ఉండడంతో, వైసిపి లోని ఈ ముగ్గురు నేతలకు ఇబ్బందికరంగా మారింది.దీంతో కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, కాసు మహేష్ రెడ్డి తాము చేసిన సవాల్ కు కట్టుబడి ఉంటారా లేక సైలెంట్ అయిపోతారా అనేది మరికొంత కాలం వేసి చూడాల్సిందే.