యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ మండల వ్యాప్తంగా వానర దండు ప్రజలను వణికిస్తున్నాయి.అడవులను విడిచి పల్లెలు, పట్టణాలే తమ అవాసాలుగా మార్చుకొని ఆహారం కోసం ఇళ్లు, షాపులపై గుంపులు గుంపులుగా పడి పోతూ, వచ్చిపోయే ప్రజల చేతిలో ఏదుంటే అది లాక్కుంటున్నాయి.
ఈ క్రమంలో వాటిని తరిమి కొట్టే ప్రయత్నంలో తిరగబడి ముక్కుమ్మడిగా దాడి చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో చిన్న పిల్లలను,వృద్ధులను బయటకు పంపాలంటేనే హడలిపోతున్నారు.
కోతుల బెడదతో మండల ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్నా కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు.
కోతుల బెడద నుండి తప్పించుకునే మార్గం లేక తమ ఇళ్లకు,షాపులకు ప్రజలు ఇనుప కంచెలు వేసుకుంటున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటిని పట్టి అడవులకు తరలించి కోతుల బెడదను నివరించాలని ప్రజలు కోరుతున్నారు.చౌటుప్పల్ పట్టణంలో కోతుల సమస్య తీవ్రంగా ఉందని వరగంటి రాజేందర్ అనే రేషన్ షాప్ నిర్వాహకులు అంటున్నారు.
ఇళ్లలోకి చొరబడి ఏది దొరికితే అది అందుకొని వెళ్తున్నాయి.తరిమి కొడుదామంటే దాడి చేస్తున్నాయి.రేషన్ సరుకుల కోసం వచ్చిన వారిపైన దాడులు చేస్తున్నాయి.ముఖ్యంగా పిల్లలు,వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు స్పందించి వెంటనే కోతుల సమస్యను పరిష్కరించాలి.








