కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని బలిగొన్నది.ఈ ప్రాణాంతక వైరస్ తర్వాత మంకీపాక్స్ ప్రపంచ దేశాల్లో సంక్రమిస్తూ ప్రజలను పట్టి పీడిస్తోంది.
ఈ నేపథ్యంలోనే మరొక కొత్త వైరస్ పుట్టుకొచ్చింది.లంపీ అనే వైరస్ ఇప్పుడు జంతువులకు సంక్రమిస్తుంది.
ఈ వైరస్ కారణంగా ఎక్కువగా ఆవులు చనిపోతున్నాయి.
లంపీ వైరస్ వల్ల మృత్యువాత పడ్డ జంతువుల సంఖ్య ఇప్పటికే వేలకు చేరుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.
రాజస్థాన్లో ఈ వైరస్ కరాళ నృత్యం చేస్తోంది.దీంతో రోజురోజుకీ ఆ రాష్ట్రంలో ఆవులు భారీ సంఖ్యలో లంపీ వైరస్ బారిన పడుతున్నాయి.రాష్ట్ర పాలక యంత్రాంగ గణాంకాల ప్రకారం, రాజస్థాన్లో ఇప్పటికే ఏకంగా 1.21 లక్షల జంతువులకు ఈ వైరస్ సోకింది.ఆందోళనకర విషయం ఏమిటంటే, వైరస్ సోకిన జంతువులలో చాలావరకు చనిపోతున్నాయి.ఇంతకీ లంపీ వైరస్ అంటే ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
లంపీ అనేది ఒక స్కిన్ డిసీజ్.కాప్రిపాక్స్ (Capripoxvirus) అనే వైరస్ కారణంగా లంపీ చర్మ వ్యాధి వస్తుంది.ఏ జంతువులైతే ఈ వ్యాధికి గురవుతాయో వాటి శరీరంపై లెక్కలేనన్ని గడ్డలు ఏర్పడతాయి.రక్తాన్ని తాగే దోమ, పేను, కందిరీగ వంటి కీటకాల ద్వారా ఈ వైరస్ పశువులను పట్టుకుంటుంది.
అపరిశుభ్ర ప్రాంతాలలో పశువులను కట్టడం వల్ల కూడా ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది.ఈ వ్యాధి వస్తే శరీరంపై గడ్డలు ఏర్పడటంతో పాటు అకస్మాత్తుగా చాలా బరువు తగ్గడం, నోటి నుంచి ద్రవం రావడం, జ్వరం, పాల ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి.
గర్భ స్రావం కావడం, గర్భం ధరించే సామర్థ్యాన్ని కోల్పోవడం వంటి సమస్యలు ఆడ ఆవులలో కనిపిస్తాయి.
అధికారిక గణాంకాల ప్రకారం, ఇప్పటిదాకా మొత్తంగా 1.21 లక్షల జంతువులకు ఈ వ్యాధి రాగా వాటిలో 94 వేల జంతువులకు చికిత్స అందించారు.దాంతో 42 వేల పశువులు ఈ జబ్బు నుంచి కోలుకున్నాయి.
అయితే 5,807 జంతువులు మరణించాయి.ఈ వ్యాధి బారి నుంచి జంతువులను కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.