‘ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం…నరజాతి చరిత్ర సమస్త పరపీడన పరాయణత్వం’…అన్నారు కదా మహా కవి శ్రీశ్రీ.దీన్నే మన చట్టసభలకు వర్తింపచేసుకుంటే ‘ఏ రాష్ర్ట అసెంబ్లీ చూసినా ఏమున్నది గర్వ కారణం….
ఏ రోజు విన్నా బూతుల పంచాంగం’…అని చెప్పుకోవచ్చు.ప్రస్తుతం ఏపీ రాష్ర్ట అసెంబ్లీ పైన చెప్పుకున్నదానికి భిన్నంగాలేదు.
ఇప్పటివరకు ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు.రోజూ అధికార, ప్రతిపక్ష సభ్యులు తిట్టుకోవడమే పని.ఇక కొట్టుకోవడం ఒక్కటే మిగిలింది.అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ఆ పని కూడా కానిస్తారేమోనని అనుమానంగా ఉంది.
ప్రతి రోజూ మాటల యుద్ధం జరుగుతున్నా గురువారం అది మరింత వాడిగా, వేడిగా ఉంది.వైకాపా మీద మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై చిచ్చు రాజుకుంది.
ఇంతకూ ఏమన్నారు ఆయన? వైకాపాను ఉద్దేశించి ‘సైకో పార్టీ’ అన్నారు.ఇంత మాట అన్న తరువాత వైకాపా సభ్యులు ఊరుకోరు కదా.తీవ్రంగా ప్రతిస్పందించారు.పార్టీ అధినేత వైఎస్ జగన్ తప్పుగా మాట్లాడిన అచ్చెన్నాయుడు మీదనే కాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు.‘ఇద్దరూ రౌడీల్లా వ్యవహరిస్తున్నారు’ అని ఆగ్రహించారు.ప్రజలు వీరి రౌడీ చర్యలను గమనిస్తున్నారని కూడా అన్నారు.
అసెంబ్లీ నిబంధనలు ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడికి వైకాపా సభ్యలు నోటీసు ఇచ్చారు.బూతులు తిట్టుకోవడానికే పరిమితమైన అసెంబ్లీ అసలు ప్రజలకు అవసరమా? దీనివల్ల ఏమీ ఉపయోగం లేనప్పుడు కోట్ల కొద్దీ ప్రజాధనం ఖర్చు చేయడమెందుకు? బయట తిట్టుకున్న తిట్లే అసెంబ్లీలోనూ తిట్టుకుంటున్నారు.అసెంబ్లీని కూలగొట్టి అక్కడొక రచ్చబండ కట్టిస్తే ఉదయమో, సాయంకాలమో అక్కడికి చేరుకొని ఒకరినొకరు ఎంతసేపైనా తిట్టుకోవచ్చు.ఇలాంటి పనులు డబ్బు ఖర్చు చేయకుండా చేయాలిగాని కోట్లు ఖర్చు పెట్టి చేయడమెందుకు? త్వరలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.అవి కూడా ఇంతకంటే భిన్నంగా ఉంటాయని అనుకోలేము.







