కృష్ణాజిల్లా గన్నవరం లో టిడిపి, స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే.ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది.
నిన్న అక్కడ టిడిపి ఆఫీస్ పై కొంతమంది దాడి చేయడంతో ఈ వివాదం మరింత పెద్దదయింది.టిడిపి కార్యాలయం తో పాటు , అక్కడే ఉన్న టిడిపి నేతలకు చెందిన కారును దహనం చేయడం వంటి సంఘటనలు వైరల్ అయ్యాయి.
ఈ వ్యవహారం తెలుసుకున్న టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అక్కడకు వెళ్ళగా ,
పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.అయితే నిన్నటి నుంచి పట్టాభి ఆచూకీ ఎవరికి తెలియలేదు.
ఆకస్మాత్తుగా ఈరోజు మధ్యాహ్నం గన్నవరం పోలీస్ స్టేషన్ కు ఆయనను తీసుకువచ్చారు.అనంతరం స్థానిక కోర్టులో ఆయన అరెస్టును చూపించారు.
ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.కోర్టుకు పట్టాభిని తీసుకెళ్తున్న సందర్భంగా ఆయన తనకు గాయాలైనట్లుగా పోలీస్ వ్యాన్ నుంచి ఆయన మీడియాకు చూపించారు.
దీంతో పట్టాభిని పోలీసులు కొట్టారని టిడిపి నేతలు కొంతమంది ఆరోపిస్తుండగా, ఈ వ్యవహారంపై పట్టాభి భార్య చందన స్పందించారు.తన భర్తను బాగా హింసించారని ఆమె ఆరోపించారు పోలీసులు సహకారంతోనే ఇదంతా జరిగిందని , తన భర్తను తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్ లో ముసుగేసుకుని ముగ్గురు వ్యక్తులు కొట్టారని చందన ఆరోపించారు.తన భర్తకు ప్రాణహాని ఉందని మొదటి నుంచి తాను చెబుతూనే ఉన్నానని ఆమె అన్నారు.
ప్రస్తుత వ్యవహారాలపై తన భర్త చాలా ఆందోళనతో ఉన్నారని , ఈ స్థాయిలో ఆందోళన తాను ఎప్పుడు చూడలేదని పట్టాభి భార్య చెబుతున్నారు.ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.పోలీసుల అదుపులో ఉన్న పట్టభిని గుర్తు తెలియని వ్యక్తులు ముసుగేసుకుని కొట్టడం సాధ్యమవుతుందా ? పట్టాభి భార్య చేస్తున్నవి కేవలం ఆరోపణలు మాత్రమేనా ? లేక పోలీసులే ఈ వ్యవహారానికి పాల్పడ్డారా అనే అనుమానాలు ఎన్నో కలుగుతున్నాయి.ఈ వ్యవహారం రాజకీయంగా మరింత దుమారం రేపేలా కనిపిస్తోంది.