టీఆర్ఎస్ పార్టలో నాయకుల మధ్య విబేధాలు ముదిరిపోయాయి.ఎవరికీ వారు నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకుంటూ పార్టీ పరువు బజారున పడేస్తున్నారు.
టీఆర్ఎస్ లో ఇప్పటికే లెక్కకు మించిన నాయకులు ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కారు ఎక్కేయ్యడంతో ఈ తలనొప్పులు మొదలయ్యాయి.ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో నేతల విబేధాలు అధినేతకు తలనొప్పిగా మారాయి.
నిజోజకవర్గాల్లోనూ టికెట్లు ఆశించే నేతలు ఎక్కువ అయిపోవడంతో ప్రధానంగా నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.దీని కారణంగానే నాయకుల అలకలు.
అసంతృప్తులు మొదలవుతున్నాయి.

తాజాగా మరో ఎమ్మెల్యే రాజకీయాలకు గుడ్ బై చెప్పే పరిస్థితి నెలకొంది.రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటించారు.
పార్టీలో క్రమశిక్షణ కొరవడిందని పేర్కొన్నారు.పార్టీలో ఎంతో మందిని ప్రోత్సహించానని, ఇపుడు వారే తనకు నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
రామగుండం మేయర్ లక్ష్మీనారాయణపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది.ఈ తీర్మానం ఉపసంహరించుకునేలా చూడాలని పార్టీ పెద్దలు సోమారపును ఆదేశించారు.అయితే ఆయన మాటను కార్పొరేటర్లు విన్పించుకునే పరిస్థితి లేకపోవటంతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న సోమారపు రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు.అయితే వాస్తవ పరిస్థితిని ఎమ్మెల్యే చెప్పేందుకు ప్రయత్నించగా.
అది వినటానికి కూడా అధిష్టానం పెద్దలు సిద్ధంగా లేకపోవటం ఈ పరిస్థితికి దారితీసిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కొద్ది రోజుల క్రితం సిరిసిల్ల మునిసిపల్ ఛైర్మన్ పావని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
కమిషన్లు తీసుకోమని మంత్రి కెటీఆరే చెప్పారని.రెండు శాతం కమిషన్లు తీసుకోవటం పెద్ద తప్పేమీ కాదన్నట్లు వ్యాఖ్యానించారు.
అప్పటికప్పుడు ఆమెను పార్టీ నుంచి తొలగించి.మళ్లీ తర్వాత చేర్చుకున్నారు.
తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఓ కౌన్సిలర్ కుమార్తెతో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.నాయకులు ఇలా ఎవరికీ వారు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతుండడం వారిని కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవడం గులాబీ బాస్ లో గుబులు రేపుతోంది.