సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పాత బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుంది.గోడలు బీటలు వారి పెచ్చులూడిపోతూ, వర్షం వస్తే పైకప్పు నుండి నీరు కారుతుంది.
ఈ పాఠశాలలో మూడవ తరగతి వరకే ఉన్నది.పూర్తిగా పాడుబడిన ఈ పురాతన భవనంలోనే 1 నుండి 3వ తరగతి చదివే పేద విద్యార్థుల తరగతి గదులు.
కొత్త బిల్డింగ్ ఒకటి ఉంటే అది అంగన్వాడికి ఉపయోగిస్తున్నారు.పాత బిల్డింగ్ లో ఒకటి హెడ్ మాస్టర్ ఆఫీస్ కు వాడుకుంటున్నారు.
అది కూడా శిథిలవస్తలోనే ఉన్నది.మిగిలిన గదులు పాక్షికంగా దెబ్బతినగా వర్షం వర్షపు నీరు కారుతుంది.
వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు సదుపాయం లేకపోవడంతో నీరంతా స్కూల్ ఆవరణలో నిలిచిపోతుంది.దీనికి తోడు సగానికి పైగా ప్రహరీ గోడ కూడా లేకపోవడంతో పశువులు,కుక్కలు పాఠశాల ఆవరణలో సంచరించడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈపాఠశాలలో సుమారు 30 మంది పేద విద్యార్థులు చదువుతున్నారు.ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని పాలకులు గొప్పలు చెబుతున్నా కాల్వపల్లి పాఠశాలను మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ పాఠశాలకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.