అగ్ర రాజ్యం అమెరికాకు ముందు ముందు రోజులు అస్సలు బాగోవంటూ అమెరికాలో ప్రఖ్యాత హాప్కిన్స్ యూనివర్సిటీ జోస్యం చెప్పింది.అమెరికా ప్రజలు జాగ్రత్తలు వహించాలని, ప్రస్తుతం కేసుల సంఖ్య పెరగడంతో పాటు మరణాల రేటు గతంలో కంటే అత్యధికంగా నమోదు అవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఏ మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరికలు చేయడంతో అమెరికా ప్రజల వెన్నులో వణుకు పుట్టుకొస్తోంది.వివరాలలోకి వెళ్తే.
కరోనా మహమ్మారి మొదటి వేవ్ అమెరికా వ్యాప్తంగా ఎలాంటి అలజడి కలిగించిందో తెలియంది కాదు.ప్రజలు పిట్టలు రాలినట్టు రాలిపోతుంటే, మృత దేహాలకు దహన సంస్కారాలు చేయించడానికి బారులు తీరారు.
ఎక్కడ చూసినా శవాల దిబ్బలే కనపడేవి.ప్రభుత్వం వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చి , సామాజిక దూరం పాటించేలా ఏర్పాటు చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
దాంతో సెకండ్ వేవ్ సమయంలో పెద్దగా అమెరికాపై ప్రభావం కనపడలేదు.కానీ థర్డ్ వేవ్ డెల్టా వేరియంట్ మాత్రం మొదటి వేవ్ కంటే కూడా తీవ్రమైన ప్రభావం చూపుతోందని అమెరికా వైద్య నిపుణులు అంచనాకు వచ్చారు.ఈ క్రమంలోనే
హాప్కిన్స్ యూనివర్సిటీ తాజాగా చేపట్టిన అధ్యయనంలో విస్తు పోయే నిజాలు వెల్లడించింది. డెల్టా వేరియంట్ కారణంగా ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య రోజు విడిచి రోజులో తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయని, రోజు మృతుల సంఖ్య 1800 పై మాటేనని ప్రకటించింది.తీవ్రమైన కోవిడ్ లక్షణాలతో మరింత మంది ఆసుపత్రులలో చేరుతున్నారని, భవిష్యత్తులో వ్యాధి లక్షణాలు కొత్త రూపు సంతరించుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది.ప్రజలు వ్యాక్సిన్ వేసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, డెల్టా విశ్వరూపం ఇప్పుడే మొదలయ్యిందని సామాజిక దూరం, మాస్క్ ధరించడం, వ్యాక్సినేషన్ మాత్రమే ప్రజలను కరోనా నుంచీ కాపాడగలవని హెచ్చరించింది.