జనసేన పార్టీలో ఏకైక ఎమ్యెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ విజయం సాధించారు.పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి చెందినా రాజోలు నుంచి రాపాక జనసేన జెండా ఎగిరేలా చేసాడు.
మొదట్లో ఆయన వైసీపీ గూటికి చేరుతారని వార్తలు వచ్చినా ఆ విషయాన్ని ఆయన ఖండించారు.అంతే కాదు తాను జనసేనలోనే ఉంటానంటూ ప్రకటించారు.
అయితే ఆయన జనసేన పార్టీలో ఇప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కొంటున్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.ఇటీవల జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ఓ సమావేశంలో బొట్టు, కాటుక పెట్టి పిలవాలా అంటూ ఆలస్యంగా వచ్చిన రాపాక ను ఉద్దేశించి పవన్ సమక్షంలో అనడాన్ని ఇప్పటికీ రాపాక జీర్ణించుకోలేకపోతున్నారట.
జనసేన నుంచి గెలిచినా ఏకైక ఎమ్యెల్యేగా తనకు సముచిత స్థానం పార్టీలో దక్కుతుంది అనుకుంటుంటే ఇలా తరచూ అవమానాలు ఎదురవుతుండడం రాపాకకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నట్ట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ నుంచి రాపాకకు ఎటువంటి ఇబ్బందులు లేవు.
నియోజకవర్గ అభివృద్ధి దృష్ట్యా ప్రస్తుతం ఉన్న అధికార పార్టీతో సన్నిహితంగా ఉండకపోతే అభివృద్ధి పనులు జరిగే పరిస్థితి లేదు.అల అని పొగిడితే జనసేన అధిష్టానానికి నచ్చడంలేదు.
దీంతో ఇటు జనసేనాని పవన్ వద్ద, కాపు సామాజిక వర్గం వద్ద కూడా రాపాక వరప్రసాద్ ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు.దీంతో ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా మారిపోయింది.
కొన్ని రోజుల కిందట జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ అధినేత, సీఎం జగన్పై రాపాక ప్రశంసల జల్లు కురిపించారు.ఈ పరిణామాలు రాపాక మీద అధిష్టానానికి మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి.
ఈ పరిణామాలు ఇలా ఉండగానే వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమం సక్సెస్ అయిన నేపథ్యంలో మంత్రి పినిపే విశ్వరూప్తో కలిసి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశాడు.ఇది జనసేనలో భారీ ప్రకంపనలు సృష్టించింది.అయితే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తాను జనసేన ఎమ్మెల్యేనే అయినప్పటికీ అధికార పార్టీతో సన్నిహితంగా మెలగకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడిందని రాపాక ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈపరిణామాల నేపథ్యంలో రాపాకకు జనసేనలో పెద్దగా ప్రాధాన్యత దక్కకడంలేదని తెలుస్తోంది.
జనసేన కీలక పదవుల్లోనూ రాపాకకు చోటు లేదు.ఏకైక ఎమ్మెల్యే అయినా తనను జనసేనాని పవన్ ఎక్కడా పట్టించుకోవడం లేదు అనే బాధ ఆయనలో ఎక్కువగా కనిపిస్తోంది.