ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి.అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరికి మించి మరొకరు పోటీ పడుతూ సభలో పై చేయి సాధించేందుకు ఒకరిని ఒకరు ఇరుకున పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
గత ఐదు రోజులుగా ఇదే తంతు కొనసాగుతోంది.ఈ రోజు సభ ప్రారంభం నుంచే పోలవరం ప్రాజెక్టుపై చర్చకు తెలుగుదేశం పార్టీ పట్టుబట్టగా, అధికారపార్టీ మాత్రం అలా కుదరదని చెప్పేసింది.
దీంతో స్పీకర్ తీరుపై టీడీపీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.తెలుగుదేశం శాసనసభ్యుల తీరుపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
పోలవరం విషయం మీద సభలో మూడు రోజులుగా చర్చిస్తూనే ఉన్నామని జగన్ అసహనం వ్యక్తం చేసారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు అంతా కుంభకోణాలు, అవినీతి మయమైందని ఆరోపించారు.ఈ విషయమై తాము నియమించిన నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని చెప్పారు.తాను ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించానని జగన్ తెలిపారు.
అక్కడ నాలుగు నెలలుగా పనులు ఆగిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు.స్పిల్వే పూర్తి కాకుండా కాపర్డ్యామ్ చేపట్టడంతో నష్టం జరిగిందని జగన్ ఆరోపించారు.
బిడ్డింగ్లో ఎవరు ఎంత తక్కువకు కోట్ చేస్తారో వాళ్లకే అప్పగిస్తామని జగన్ స్పష్టం చేశారు.ఈ ప్రాజెక్టు నిధులపై రీ బిడ్డింగ్ వేస్తే రూ.6,500 కోట్ల పనుల్లోనే 15-20 శాతం నిధులు అంటే 1500 కోట్ల దాకా మిగిలే అవకాశముందని జగన్ పేర్కొన్నారు.పోలవరం ప్రాజెక్టులో టీడీపీ నేతలు ఎంత దోచుకున్నారో మరో మరో 15 రోజుల్లో అంతా లెక్కతేల్చుతామని జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
పోలవరం కాంట్రాక్టర్ల విషయంలో అప్పటి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిందని, నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టర్ ను ఎంపిక చేశారన్నారు.అప్పటి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కూడా సబ్ కాంట్రాక్టర్గా పని చేస్తున్నారు.ఎంతటి దారుణమైన కుంభకోణాలు జరుగుతున్నాయో చూశాం.పనులు ప్రారంభించకుండానే రూ.724 కోట్లు అడ్వాన్స్ కింద కట్టబెట్టారు.పోలవరంలో ఎంత దోచారో మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది అప్పుడు తెలుగుదేశం బండారం బయటపడుతుందని జగన్ అన్నారు.