జగన్ ఎప్పుడూ సంచలన నిర్ణయాలు తీసు కుంటూనే వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు.ముఖ్యంగా టిడిపి నాయకులకు సంబంధించిన అవినీతి వ్యవహారాలను బయటకు తీసేందుకు, వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నించేందుకు మొదటి నుంచి చూస్తున్నారు.
అయితే ఆ కేసు ద్వారా జగన్ కు , ఆయన పార్టీకి ఎంత వరకు లాభం చేకూరుతుంది, అలాగే టిడిపి ఇమేజ్ ఎంత వరకు డ్యామేజ్ అవుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే, టిడిపి నాయకుల అవినీతి వ్యవహారాలను వెలుగులోకి తీసుకు వస్తుండడం వల్ల ఆ పార్టీపై ప్రజలకు భావం ఏర్పడుతుంది అనేది జగన్ అభిప్రాయంగా కనిపిస్తోంది.ఇప్పటికే ఎంతోమంది టిడిపికి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులను టార్గెట్ చేసుకున్న జగన్ ఇప్పుడు టిడిపి యువ నాయకుడు చంద్రబాబు తనయుడు లోకేష్ ను టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తున్నారు.
దీనిలో భాగంగానే ఏపీ ఫైబర్ నెట్ పథకం అమలులో అక్రమాలు జరిగాయని, దీనిని విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని సిఐడి కి ఆదేశాలు జారీ చేశారు.గత టిడిపి ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ కాంట్రాక్టర్ కు అనుకూలంగా టెండర్లను ఖరారు చేశారని, దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఏపీ ఫైబర్ నెట్ ఎండి ప్రభుత్వానికి నివేదిక అందించారు.
వైసిపి ప్రతిపక్షంలో ఉండగానే ఏపీ ఫైబర్ నెట్ విషయంలో అనేక విమర్శలు చేసింది.ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఈ వ్యవహారంలో ఉన్నారని, ఏపీ ఫైబర్ నెట్ కాంట్రాక్టర్ లోకేష్ అనుచరుడు అనే విషయాన్ని విజయసాయి రెడ్డి వంటి వారు పదే పదే ప్రస్తావించేవారు.
వాస్తవంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంపై దృష్టి పెట్టి లోకేష్ ను ఇరుకున పెడతారు అని అంతా భావించినా, జగన్ సైలెంట్ అయిపోయారు.సరిగ్గా రెండేళ్ల తరువాత వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు సిద్ధం అవుతూ ఉండడంతో లోకేష్ టార్గెట్ గానే జగన్ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
అయితే ఉన్నట్టుండి లోకేష్ ను టార్గెట్ చేసుకోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు, పథకాల విషయంలో లోకేష్ గట్టిగానే వాయిస్ వినిపిస్తూ విమర్శలు చేస్తున్నారు.దీంతో గతంతో పోలిస్తే లోకేష్ ఇమేజ్ బాగానే పెరిగింది.దీంతో అప్రమత్తమైన వైసిపి ఈ ఫైబర్ నెట్ కేసు ను తెరపైకి తెచ్చిందనే వాదనలు ఉన్నాయి.