ఆస్తమా గురించి తెలియని వారు ఉండరు.ఆస్తమా వ్యాధి ఉన్నవారికి డాక్టర్లు ఎక్కువగా ఇన్హేలర్స్తో చికిత్స చేస్తుంటారు.
అయితే ఇలా ప్రతిసారి ఆస్తమా వ్యాదిగ్రస్తులు ఇన్హేలర్స్ ను వాడడం మంచిదా.కాదా.? అనే ఆలోచనలో ఉంటూ ఉంటారు.అలాగే ప్రజల్లో కూడా ఇన్హేలర్స్ వాడే విషయంలో చాలా అపోహలు ఉన్నాయి.
ఎందుకంటే ఇన్హేలర్స్ లో మందును పెట్టి పీల్చేటప్పుడు ఆ మందు డైరెక్ట్ గా ఊపిరితిత్తులోకి వెళ్తుంది.అలా ఊపిరితిత్తులోకి మందు పీలవడం వలన ఏదైనా హాని జరుగుతుందేమో అని కొందరు ఆందోళన పడుతుంటారు.
పెద్దవాళ్ళ విషయం పక్కన పెడితే ముఖ్యంగా చిన్నారులు, పసివాళ్ళు ఇలా ఇన్హేలర్స్ పీల్చడం ఎంతవరకు మంచిది అని సందేహ పడుతుంటారు.
అయితే వాస్తవానికి ఇన్హేలర్స్ వాడడం వలన ఊపిరితిత్తులకు ఎలాంటి హాని ఉండదు.
అవి వాడడం వలన ఆరోగ్యానికి చాలా సురక్షితం అనే చెప్పవచ్చు.నిజానికి మనం ఏదన్నా ఒక మందును మింగితే ఆ మందు శరీరంలోని ఊపిరితిత్తులకే కాకుండా శరీరంలోని మిగతా అన్ని అవయవాలలోని కణాలకూ చేరుతుంది.
కానీ ఇన్హేలర్స్ విషయంలో అలాంటిది జరగదు.ఎందుకంటే ఇన్హేలర్స్ లోని మందు కేవలం సమస్య ఉన్న చోటే చికిత్స జరిగేలా చూస్తాయి.
అంటే ఇన్హేలర్స్లోని మందు కేవలం ఊపిరితిత్తుల మీదనే ప్రభావం చూపుతుంది.అలాగే ఇన్హేలర్స్ లో వాడే మందు మోతాదు కూడా చాలా తక్కువ గా ఉంటుంది.ఇది కేవలం మైక్రోగ్రాముల్లో మాత్రమే ఉంటుంది.అంటే టానిక్స్, ట్యాబ్లెట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ మోతాదు అన్నమాట.అందుకనే మీరు ఇకమీదట ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఇన్హేలర్స్ వాడవచ్చని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.