లెక్కలు తప్పుగా చూపడం, ఫోర్జరీ చేసినందుకు గాను భారత సంతతికి చెందిన టెక్ కంపెనీ మాజీ సీఎఫ్వోకి సింగపూర్ న్యాయస్థానం 11 నెలల జైలు శిక్ష, 20 వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.నిందితుడిని గురుచరణ్ సింగ్గా గుర్తించారు.
TREK 2000 ఇంటర్నేషనల్లో పనిచేసే అతనిపై ఎనిమిది అభియోగాలు మోపారు.గురుచరణ్కు శిక్ష విధించేందుకు గాను మరో తొమ్మిది అభియోగాలను న్యాయమూర్తి పరిగణనలోనికి తీసుకున్నట్లు ది బిజినెస్ టైమ్స్ నివేదించింది.
ఈ ఏడాది అక్టోబర్లో కంపెనీ వ్యవస్థాపకుడు హెన్ టాన్ , మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూ టెంగ్ పిన్లు ఇదే మోసంలో దోషులుగా తేలిన తర్వాత గురుచరణ్ సింగ్కు శిక్ష పడింది.2011లో Trek 2000 సంస్థ T-Data Systemsతో సుమారు 2.79 మిలియన్ డాలర్ల విలువైన ఏడు లావాదేవీలు జరిపినట్లు సింగపూర్ వాణిజ్య వ్యవహారాల శాఖ దర్యాప్తులో తేలింది.పూ టెంగ్ పిన్ భార్య టీ డేటా సిస్టమ్స్లో ఏకైక వాటాదారు కావడం గమనార్హం.
అయితే సంస్థ లావాదేవీల నిర్వహణకు సంబంధించి సీఎఫ్వోగా గురుచరణ్ సింగ్ పూర్తిగా విఫలమయ్యాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
అంతేకాకుండా.డిసెంబర్ 31, 2015న ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ బుక్స్ని మార్చేందుకు టాన్, పూ టెంగ్లతో కలిసి గురుచరణ్ సింగ్ కుట్ర పన్నాడని తేలింది.అలాగే యూనిమిక్రాన్ టెక్నాలజీకి 3.2 మిలియన్ల విలువైన కల్పిత విక్రయాన్ని నమోదు చేశారని కూడా ది బిజినెస్ టైమ్స్ నివేదించింది.దీనితో పాటు ఎర్నెస్ట్ అండ్ యంగ్కు చెందిన కంపెనీ ఆడిటర్లను మోసం చేసినట్లు కూడా పోలీసులు తేల్చారు.
ఇదే సమయంలో యూనిమిక్రాన్ విక్రయానికి మద్ధతుగా రెండు బ్యాంక్ అడ్వైజరీలను ఫోర్జరీ చేయాల్సిందిగా గురుచరణ్ సింగ్ ఒక ఉద్యోగి సహాయం కోరినట్లుగా తెలుస్తోంది.దీనితో పాటు కుట్రదారులంతా కలిసి ఒక తప్పుడు పత్రాన్ని కూడా సృష్టించినట్లుగా పోలీసులు దర్యాప్తులో తేల్చారు.