బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో కొద్దిరోజుల క్రితం హత్యకు గురైన భారత సంతతి మహిళ కేసులో భర్తే హంతకుడని తేల్చారు పోలీసులు.డిసెంబర్ 7న తన భార్య హర్ప్రీత్ కౌర్ (40)ని నవీందర్ గిల్ విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపినట్లు ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ) దర్యాప్తులో తేలింది.
సంఘటన జరిగిన రోజు రాత్రి గిల్ను అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలేశారు.అయితే గత వారం మరోసారి నవీందర్ను అదుపులోకి తీసుకున్నారు.
డిసెంబర్ 16న నవీందర్ గిల్పై సెకండ్ డిగ్రీ మర్డర్ అభియోగాలు మోపారు.ముగ్గురు పిల్లల తల్లి అయిన హర్ప్రీత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
ఇది గృహ హింస కేసు కావొచ్చునని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.ఈ తరహా కేసులను పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకుంటుందని చెప్పారు.
మరోవైపు .భారతదేశంలోని హర్ప్రీత్ కుటుంబానికి ప్రయాణ ఖర్చులు , అంత్యక్రియల ఏర్పాట్లు , చట్టపరమైన రుసుములను కవర్ చేసేందుకు గాను ‘‘GoFundMe’’ పేజీలో క్యాంపెయిన్ ప్రారంభించారు.హర్ప్రీత్ తల్లిదండ్రులు, ఆమె సోదరుడు భారత్లోనే నివసిస్తున్నారు.ఆమె పేరెంట్స్ కూడా తమ మనవళ్ల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని, వారి కస్టడీకి సంబంధించి న్యాయ సలహా తీసుకోవాలని వారు కోరుతున్నారు.20 వేల డాలర్లు సేకరించాలని గో ఫండ్ మీ పేజీలో టార్గెట్ పెట్టుకోగా.ఇప్పటి వరకు 10,906 డాలర్లను వసూలు చేశారు.
కాగా.డిసెంబర్ 3న మిస్సిసాగాలోని గ్యాస్ స్టేషన్ వెలుపల 21 ఏళ్ల పవన్ ప్రీత్ కౌర్ అనే పంజాబీ సంతతికి చెందిన యువతిని దుండగులు కాల్చిచంపిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఘటన జరిగిన రోజు రాత్రి 10.40 గంటలకు క్రెడిట్ వ్యూ రోడ్, బ్రిటానియా రోడ్ వెస్ట్లో వున్న పెట్రో కెనడాలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు పీల్ రీజినల్ పోలీసులు తెలిపారు.సమాచారం అందిన వెంటనే తాము అక్కడికి చేరుకున్నామని.బుల్లెట్ గాయాలతో పడివున్న పవన్ప్రీత్ కౌర్కు వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం దక్కలేదని, ఆమె ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.