తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.బిజెపి అగ్ర నేతలతో ఆయన సమావేశం అవుతున్నారు.
ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం, అలాగే పార్టీలో చేరికలు, ఎన్నికల వ్యూహాలు, ఇలా అనేక అంశాలపై చర్చించేందుకు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు.అలాగే త్వరలోనే బిజెపి ( BJP )అగ్ర నేతలు తెలంగాణలో పర్యటించబోతున్న నేపథ్యంలో , ఆ పర్యటనకు సంబంధించిన వ్యవహారాలపై చర్చించేందుకు ఢిల్లీ కి వెళ్లినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈనెల 25న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( JP Nadda ) తెలంగాణకు రాబోతున్నారు.
అలాగే ఈనెల ఆఖరున కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Union Home Minister Amit Shah ) తెలంగాణలో జరగబోయే బిజెపి సభకు హాజరు కాబోతున్నారు.దీంతో పాటు , ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన అనంతరం, ఆయన కూడా తెలంగాణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సంజయ్ ఈ వ్యవహారాలపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.దీనిపైన అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
ఇటీవల కాలంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించి ఆస్థానంలో మరొకరికి అవకాశం కల్పించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది .గత కొంతకాలంగా తెలంగాణ బిజెపిలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, పాత కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడం, చేరికలు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం వంటి వ్యవహారాలతో బిజెపి ఇబ్బందులు పడుతోంది.
ఈ నేపథ్యంలోని తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించి, ఆయన స్థానంలో చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల రాజేందర్ ను కానీ , మరో సీనియర్ నేతకు గానీ పార్టీ అధ్యక్ష పదవి అప్పగించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.అలాగే త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్న నేపథ్యంలో , బండి సంజయ్ కు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించబోతున్నారనే హడావుడి జరుగుతున్న నేపథ్యంలో సంజయ్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.