సూర్యాపేట జిల్లా:దేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా నిలిచిన స్వతంత్ర్య ఉద్యమంలో కమ్యూనిస్టులు అమోఘమైన పాత్ర పోషించారని,కానీ,నిజమైన దేశభక్తులమని ప్రచారం చేసుకునే ఆర్ఎస్ఎస్ లేదా మరే హిందుత్వ సంస్థ గాని జాతీయ ఉద్యమంలో ఎటువంటి పాత్ర పోషించలేదని పైగా బ్రిటిష్ వారితో కుమ్మక్కై స్వాతంత్ర్య పోరాటాన్ని నీరుగార్చే పాత్ర పోషించి నీచ చరిత్రను మూట కట్టుకున్నారని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి విమర్శించారు.ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత “స్వాతంత్ర్యోద్యమం- కమ్యూనిస్టుల పాత్ర’అనే అంశంపై నిర్వహించిన సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆనాడు విద్రోహపూరిత పాత్ర పోషించిన హిందుత్వ శక్తులే నేడు కేంద్రంలో అధికారంలో ఉండటం దేశం ముందున్న అత్యంత విషాద ఘట్టమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ మహాసభ ముందు సంపూర్ణ స్వరాజ్య సాధన తీర్మానాన్ని ఉంచడంలో కమ్యూనిస్టులు కీలకపాత్ర పోషించారన్నారు.మీరట్ కుట్ర కేసు,పెషావర్ కుట్ర కేసు,కాన్పూర్ కుట్ర కేసులు బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టులపై బనాయించారన్నారు.1948 జనవరి 30న గాంధీజీని నాథూరామ్ గాడ్సే హత్య చేశారని, ఈ హత్యకు సూత్రధారి సావర్కర్ అని పేర్కొన్నారు.1942లో క్విట్ ఇండియా తీర్మానం చేసినప్పుడు దానిని బహిరంగంగా వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరాలని హడావుడి చేస్తుందన్నారు.బిజెపి ప్రభుత్వం మొదటి నుండి ఈ జాతీయ జెండాను గుర్తించడానికి నిరాకరించిందన్నారు.భారత రాజ్యాంగాన్ని కూడా ఆర్ఎస్ఎస్ విదేశీ రాజ్యాంగంగా పరిగణిస్తుందన్నారు.మనుధర్మశాస్త్రమే మన దేశానికి రాజ్యాంగంగా ఉండాలన్నది ఆర్ఎస్ఎస్ వైఖరి అన్నారు.బిజెపి దొంగ వైఖరికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ బిజెపి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
మోడీ ప్రభుత్వ పాలనలో దేశ ప్రజా సంపదనంతా అదానీ,అంబానీలకి దోచిపెడుతూ దేశభక్తి నీతులు వల్లిస్తుందన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని అప్పనంగా కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ వారి ఆదాయాల పెరుగుదలకు మాత్రమే బిజెపి పని చేస్తుందన్నారు.
వల్లించేది దేశభక్తి నీతులు చేసేది కార్పొరేట్ కంపెనీల సేవ అనే పద్ధతిలో బిజెపి పాలన ఉందన్నారు.దీనికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో అన్ని ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,బుర్రి శ్రీరాములు,ఎల్గూరి గోవింద్,మట్టిపెళ్లి సైదులు,కోట గోపి,జిల్లేపల్లి నరసింహారావు,వీరబోయిన రవి, మేదరమెట్ల వెంకటేశ్వరరావు,దేవరం వెంకటరెడ్డి, మేకనబోయిన శేఖర్,చిన్నపంగు నరసయ్య,మద్దెల జ్యోతి,మేకనబోయిన సైదమ్మ,చెరుకు ఏకలక్ష్మి,మిట్ట గడుపుల ముత్యాలు,వేల్పుల వెంకన్న,ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.