భార్యలంటే ప్రతి భర్తకు ప్రేమ ఉంటుంది.కానీ ఓ వ్యక్తి చూపించిన ప్రేమ ఇప్పుడు వార్తల్లోకెక్కింది.అతడేదో కారు, ఇల్లో, ఇంకేదైనా బహుమతో ఇవ్వలేదు.మరి ఎందుకు వార్తల్లోకెక్కాడని అనుకుంటున్నారా.అదే చెప్పబోతున్నాం.మధ్రప్రదేశ్ లోని డిండౌరీ జిల్లాకు చెందిన ఓంకార్ దాస్.
స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.అతడికి 25 ఏళ్ల క్రితం రుక్మిణి అనే మహిళతో పెళ్లి జరిగింది.
కానీ వారికి సంతానం లేదు.అయినా ఓంకార్ దాస్, రుక్మిణి దంపతులు చాలా అన్యోన్యంగా ఉండేవారు.
కానీ రుక్మిణి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది.ఆ బాధను తట్టుకోలేక పోయాడు ఓంకార్ దాస్.
ఎవరూ లేని తనకు తన భార్యే అన్నీ.కష్టనష్టాల్లో తోడుగా ఉండేది.
సుఖ దుఃఖాలు కలిసి పంచుకుంది.
ప్రతి విషయంలోనూ ఆమె అతడికి అండగా నిలబడింది.
అలాంటి జీవిత భాగస్వామి, చచ్చే వరకు తోడుగా ఉంటానన్న మనిషి చనిపోవడంతో ఓంకార్ దాస్ కన్నీరు మున్నీరయ్యాడు.తన భార్య శవాన్ని ఇంట్లోని పూడిస్తే తనతో పాటే ఉన్నట్లుగా ఉంటుందని అనుకున్నాడు.
ఇంట్లోనే తన భార్య మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు.ఇంట్లో శవాన్ని పూడ్చిపెట్టడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తర్వాత కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్థానిక అధికారులు ఆ ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్లి… పూడ్చి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీశారు.
ఆ తర్వాత ఆ మృతదేహాన్ని నర్మదా నది ఒడ్డున పాతి పెట్టారు.