బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.తెలంగాణతో పాటు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి బిజెపికి ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనికోసం ఆయన వివిధ రాష్ట్రాల్లో భారీ ఎత్తున బీఆర్ఎస్ సభలను నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అలాగే తమ ప్రధాన రాజకీయ శత్రువు బీజేపీ పైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభావాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.అంతకంటే ముందుగా త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుకుని , మూడోసారి అధికారంలోకి రావడం ద్వారానే దేశ రాజకీయాల్లో కీలకం కావొచ్చని కేసిఆర్ బలంగా నమ్ముతున్నారు.
దీనికి తగ్గట్టుగానే రాష్ట్రవ్యాప్తంగా భారీగా సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇక కెసిఆర్ సైతం జిల్లాలు , నియోజకవర్గాల వారిగా ఇప్పటికే పర్యటనలు మొదలుపెట్టారు.నిత్యం ప్రజలకు, పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటున్నారు.ఇవన్నీ ఎలా ఉంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుకునేందుకు దూకుడుగా ముందుకు వెళ్లాలంటే 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఇబ్బందికరంగా మారాయి.
అప్పటి హామీలు ఇప్పటి వరకు అమలు కాకపోవడం, అలాగే మరికొన్ని పథకాలను మధ్యలో ప్రవేశపెట్టినా వాటికి నిధులు కేటాయించకపోవడం ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి.
ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో కెసిఆర్ పూర్తిగా దానిని అమలు చేయలేకపోవడం, అలాగే 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో దళిత బంధు పథకానికి 17,700 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో చూపించినా, ఇప్పటి వరకు దానికి ఖర్చు చేయకపోవడం , అలాగే సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు మూడు లక్షలు ఆర్థిక సహాయం చేస్తామని గత బడ్జెట్ లో ప్రవేశపెట్టినా, ఇప్పటికీ అది అమలు కాకపోవడం, ఇక నిరుద్యోగులకు 3016 భృతి కింద ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినా, అది కూడా అమలు కాకపోవడం , గొర్రెల పెంపకం దారులకు యూనిట్లు ఇస్తామని వారి వద్ద సొమ్ములు కట్టించుకున్నా, ఇప్పటివరకు ఇవ్వకపోవడం ఇలా ఎన్నో హామీలు బీఆర్ఎస్ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాయి.రాబోయే ఎన్నికల ప్రచారంలో ఇవన్నీ బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగానే మారుతాయి.కచ్చితంగా ప్రజల నుంచి వీటిపై తిరుగుబాటు వస్తుందేమో అనే భయం కేసిఆర్ లోను కనిపిస్తోంది .