అగ్ర రాజ్యం అమెరికాను పట్టి పీడిస్తున్న ఏకైక సమస్య తుపాకీ సంస్కృతి.కరోనా, ప్రకృతి విపత్తులు, లక్షల ఎకరాల అటవీ భూమి అగ్నికి ఆహుతై పోవడం, నిరుద్యోగం, ఇవేమీ కూడా అమెరికా ప్రతిష్టకు భంగం కలుగనీయవు కానీ ఒక్క తుపాకీ సంస్కృతి మాత్రమే అమెరికాను దోషిగా అక్కడి ప్రజల ముందు, చేతకాని దేశంగా ప్రపంచం ముందు నిలబెడుతోంది.
శ్వేత జాతీయుల జాత్యహంకారానికి ఎంతో మంది నల్లజాతీయులు తుపాకీ తూటాలకు బలై పోతున్నారు.తాజాగా అమెరికాలో 10 మంది నల్లజాతీయులు మృతి చెందిన విషయం విధితమే, ఆ ఘటన మరువక ముందో మరో ముగ్గురు మృతి చెందటం రెండు సంఘటనలు కూడా తుపాకీ కాల్పుల కారణంగానే జరగడంలో ప్రస్తుతం అగ్ర రాజ్యం తుపాకీ సంస్కృతే హాట్ టాపిక్ అయ్యింది.
సరిగ్గా ఏడాది క్రితం వరుస తుపాకీ పేలుళ్ళ ఘటనలు జరిగి ఎంతో మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.ఆ సమయంలో తుపాకీ నియంత్రణ చట్టాలను బలోపేతం చేసేందుకు స్వచ్చంద సంస్థలు బిడెన్ పై ఒత్తిడి తీసుకురాగా ఇప్పటికి వరకూ ఆ చట్టం అమలు నోచుకోలేదు.
ఇప్పటి వరకూ ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతో మంది కాకలు తీరిన అధ్యక్షులు వచ్చినా తుపాకీ నియంత్రణ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు.అసలు ఎందుకు ఇంతగా అమెరికాలో తుపాకీ సంస్కృతీ పెరిగిపోయింది…అందుకు రీజన్ ఏంటి.
బ్రిటీషర్లు అమెరికాను పాలించిన సమయంలో అమెరికా పెద్ద దేశమే కాదు, అక్కడ పోలీసు వ్యవస్థ కానీ, మిలటరీ వ్యవస్థ లేదు.దాంతో అక్కడి ప్రజలు తమ ఆత్మ రక్షణ కోసం తుపాకులను వాడటం మొదలు పెట్టారు.
దాంతో వారికి తుపాకులు అందించడంతోనే బ్రిటీష్ కంపెనీలు అప్పట్లో భారీ లాభాలను ఆర్జించాయి.ఈ క్రమంలో అమెరికాకు స్వాతంత్ర్యం రావడంతో అక్కడి రాజ్యాంగం అమెరికన్స్ కు తుపాకీ వాడే హక్కును కల్పించింది.
అప్పుడు ప్రాణ రక్షణ కోసం పెట్టుకున్న చట్టం ఇప్పుడు అదే అమాయకపు ప్రజల ప్రాణాలు తీస్తోంది.అయితే ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా చట్టంలో మార్పులు ఉండాలని సూచించినా ఎలాంటి చట్ట సవరణలు జరగడం లేదు.