భారత దేశ రెండో ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్ర్తీ బాధ్యతలు చేపట్టిన తరువాత 1965 లో భారత్ పై పాకిస్థాన్ సైనిక దాడికి పాల్పడింది.ఆసమయంలొనే ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది.
ఆ సందర్భాలను పురస్కరించుకుని రామ్ లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో సైనికులను,రైతులను ప్రోత్సహించడానికి లాల్ బహదూర్ శాస్ర్తీ జై జవాన్ ! జై కిసాన్ !! నినాదాలను ఇచ్చాడు.భారత దేశంలో క్రీస్తు పూర్వం తొమ్మిది వేల సంవత్సరం నాటికి భారతీయ వ్యవసాయం ప్రారంభమైనట్లు చరిత్ర చెపుతోంది.
దక్షిణ భారతదేశంలో పాత చోళరాజు కరికలన్ క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో కావేరి నదిపై “‘ గ్రాండ్ ఆన్ కట్ “‘ ఆనకట్ట నిర్మాణంతో సాగునీటి వ్యవసాయం అభివృద్ధి చెందింది.సహస్ర వృత్తులు సృష్టించిన పనిముట్లతో,పశువుల మచ్చికతో భూమిని సాగుచేసి పంటలు పండించి బతకడానికి అన్నం పెట్టిన వృత్తి వ్యవసాయం అయింది.
వ్యవసాయాన్ని కొనసాగించి రైతుగా, అన్నదాతగా ,ఆహార ప్రదాతగా,రైతేరాజుగా కీర్తించబడినాడు.కాని వాస్తవంగా గతం కంటే ఇప్పుడు కష్టాలు, నష్టాలు ఎక్కువైనవి.
నాటి స్వావలంబన సాంప్రదాయక వ్యవసాయంలో పంట పండకుంటే రెక్కల కష్టాన్ని నష్ట పోయిండు.నేటి పరాధీనత ఆధునిక వ్యవసాయం లో ఆహార ఉత్పత్తులు పెరిగి హరిత విప్లవం పరిఢవిల్లుతుంది.
ఆహార కొరత కూడా నివారించబడింది.కాని రైతుల బతుకుల్లో ఆర్ధిక విస్ఫోటనం పెరిగింది.
ట్రాక్టర్, ఆర్వెస్టర్ మొదలగు యాంత్రీకరణ , విత్తనాలు, రసాయన ఎరువులు కూలీల ఖర్చులు పెట్టి పంటను సాగు చేసినప్పటికీ ప్రకృతి అనుకూలించినప్పుడే పంట పండుతుంది.ఇంకా విత్తిన పంటను కోతులు,అడవి పందుల భారీ నుండి కాపాడుకోవడం అసాధ్యం అవుతుంది.
దానితో ఇప్పటి వ్యవసాయం వ్యయసాయంగా మారింది.రైతుల బతుకులు గాలిలో దీపం అయింది.
వ్యవసాయంలో రహదారి, రవాణా సమస్యలతో రైతులు తీవ్ర యిబ్బందులు పడుతున్నారు.సాగు భూముల విస్తరణ పెరిగినందున రవాణా సౌకర్యం ఆవశ్యకత పెరిగింది.కూలీలను మోటార్ ఆటో,వ్యాన్,ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ లలో తరలించవలసి వస్తోంది.వ్యవసాయ సంబంధమైన పని ముట్లు, పాలు,ధాన్యం, ఎరువులు మోటారు వాహనాలలోనే తరలించాలి.
దానికి తారు, సిమెంటు రోడ్డు మార్గం కాకున్న కనీసం మొరం రోడ్డు అయిన కావాలి.కరీంనగర్ లోక సభ, హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గాలలోని వెన్కేపల్లి సైదాపూర్ మండలం, దుద్దెనపల్లి గ్రామంలోని పెద్ద చెరువు( పడాల చెరువు) మత్తడి ప్రవాహా నీళ్లతో ముడాగుల మొరం రోడ్డుకు గండిపడింది.
తెలంగాణ ప్రభుత్వం చిన్న నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పనులను 2015 అక్టోబర్ 3న ప్రారంభించింది.అందులో భాగంగా దాదాపు రూ 98•13 లక్షల వ్యయంతో పడాల చెరువు పూడిక తీశారు.
దానికి దిగువన గొలుసు చెరువుగా ఉండే రేణికుంట(మీది కుంట)ను కూడా 2018 ఏప్రిల్ 10న మిషన్ కాకతీయ పునరుద్ధరణ పనులలో రూ 31•65 లక్షల వ్యయంతో పూడిక తీశారు.అట్టి మీదికుంట దిగువన కిందికుంట, నాగుల చెరువు ఉన్నది.
అంటే పడాల చెరువు మత్తడి నీళ్లతో మూడు జలాశయాలు నిండుతాయి.

గడచిన 2021లో అతివృష్టిగా వర్షాలు కురిసినందున మరియు వరద కాలువ నీళ్ల వలన దుద్దెనపల్లి పెద్ద చెరువు ఉప్పొంగిన నీటి ప్రవాహంతో మత్తడి దూకింది.చెరువు మత్తడి నీళ్లు సహజసిద్ధమైన కాలువ ద్వారా ప్రవహించి మూడాగుల మొరం రోడ్డు కోతకు గురైంది.అవిభక్త ఆంద్రప్రదేశ్ లో పనికి ఆహార పథకం ద్వారా 2001లో పోసిన మొరం రోడ్డు మరియు సిమెంట్ పైపుల కాల్వర్ట్ నీటి ప్రవాహానికి కొట్టుకు పోయినవి.
దానివలన దుద్దెనపల్లి, ఎక్లాస్ పూర్, రేకొండ గ్రామాల రైతులకు,ప్రజలకు ప్రయాణ,రవాణా సౌకర్యాలు నిలిచిపోయినవి.మత్తడి ప్రవాహ నీళ్ల కాలువ అవతలి వ్యవసాయ పంటల దగ్గరకు పోవడానికి రైతులు నీటి ప్రవాహా కాలువపై తాటి చెట్టు మొద్దులను వేసుకుని నడకతో ప్రయాణించి ఆవుల,గేదెల పాలను పితికే పనులను తీర్చుకున్నారు.
ధర్మఘంటను మోగించుతే నాటి రాజు స్పందించి సమస్యలు పరిష్కరించినట్లుగా చరిత్ర చెపుతోంది.నేటి సర్వ సత్తాక గణతంత్ర ప్రజాస్వామ్యం ప్రజల సమస్యలపై నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటే ప్రజల్లో అసహనం గూడుకట్టుకుంటుంది.
ప్రజల పన్నులతో సకల సౌకర్యాలను అనుభవిస్తున్న అధికారులు,పాలకులు ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నారు.







