ప్రమాదకరంగా గోదావరి ప్రవాహం: మొదటి హెచ్చరిక జారీ..!

భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు అధికంగా కురుస్తుండడంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.

తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఇరిగేషన్ అధికారులు జారీ చేశారు.దీంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వస్తున్న మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

ఇప్పుడు అక్కడ ఔట్ ఫ్లో పది లక్షల క్యూసెక్కలు ఉందని అధికారులు వెల్లడించారు.గోదావరి ప్రవాహ తీవ్రత ఎక్కువ అవుతుండడంతో నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కాగా, దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి.ఈ గ్రామాలకు విద్యుత్ సరాఫరా కూడా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

ఇక పి.గన్నవరం నియోజకవర్గంలోని చాకలిపాలెం కాజ్ వే మునిగిపోవడంతో సమీప లంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు కొనసాగిస్తున్నారు.ఇప్పటికే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది.

ప్రస్తుతం అక్కడ 45 అడుగులు ఉన్న నీటిమట్టం మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు