ఎన్నికలు అనగానే అన్ని పార్టీలకు భయం ఉంటుంది.గెలుస్తామో, గెలవమో అనే సందేహం ఉంటుంది.
ఇది సాధారణ ఎన్నికల విషయంలో.అయితే ఉప ఎన్నిక విషయంలోనూ భయం ఉంటుందా? ఉంది.అది ప్రతిపక్షాలకు కాదు.అధికార పక్షానికి.తెలంగాణాలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి వరంగల్ ఉప ఎన్నిక విషయంలో భయంగా ఉంది.సాధారంగా ఉప ఎన్నిక విషయంలో అధికార పార్టీ భయపడదు.
కాని తెలంగాణాలో పరిస్థితి భిన్నంగా ఉంది.గులాబీ పార్టీకి, ప్రధానంగా సీఎమ్ కేసీఆర్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
ఈ వ్యతిరేకత పెరుగుతూ ఉంది.ప్రధానంగా రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి గుదిబండలా మారాయి.
జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఉంది.వందలాది మంది రైతులు ప్రాణాలు వదిలినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడంతో ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
అసెంబ్లీలో సర్కారు జవాబు చెప్పలేకపోయింది.మరో మాటలో చెప్పాలంటే ప్రభుత్వం ఓడిపోయింది.
అందుకే 6 లక్షల నష్ట పరిహారం ఇస్తామని వెంటనే ఒప్పుకుంది.అదికూడా 2014 జూన్ 2 నుంచి అంటే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇస్తామని చెప్పింది.
తమ ప్రభుత్వం 16 నెలల పసిపాప అని, ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలదే బాధ్యత అని చెప్పిన సర్కారు పూర్తిగా దిగి వచ్చిందంటే అందుకు కారణం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నికేనని అర్ధమవుతోంది.రైతు కుటుంబాలను ఆకట్టుకోవడానికే గత ఏడాది జూన్ నుంచి పరిహారం ఇస్తామని చెప్పింది.
మొన్నటివరకు చెప్పిన దానికి పూర్తిగా భిన్నంగా వ్యవహరించడానికి కారణం వరంగల్ ఉప ఎన్నిక భయమే.







