యూఏఈ.ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది ఒకటి ఏడారులు, రెండోది దుబాయ్.
చుట్టూ ఇసుక తిన్నెలు తప్పించి ఏం లేకపోయినా, చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నా వాతావరణ పరిస్ధితులను జయించి మరి ఆ దేశం ప్రపంచంలోని సంపన్నమైన, శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా నిలిచింది.భారత్తో పాటు అనేక దేశాలకు చెందిన వారు నేడు ఉపాధి కోసం యూఏఈకి వెళ్తున్న సంగతి తెలిసిందే.
భీకరమైన ఎండలు, వేడిగాలులకు పెట్టింది పేరైన యూఏఈలో ఇప్పుడు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.అవును మీరు వింటున్నది అక్షరాల నిజం.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్ధితులు నెలకొన్న సంగతి తెలిసిందే.యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో సూర్యుడు నిప్పులు కురిపిస్తుంటే.భారత్ వంటి భూమధ్య రేఖకు దగ్గరగా వుండే దేశాల్లో మాత్రం భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి.ఇప్పుడు ఇదే యూఏఈలోనూ కనిపించింది.
రాతి ఎడారి ప్రాంతంగా చెప్పుకునే పుజైరా తో పాటు షార్జా నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో వరదలు పోటెత్తాయి.గడిచిన మూడు దశాబ్ధాల కాలంలో ఎన్నడూ ఈ తరహా పరిస్ధితిని చూడలేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు.జాతీయ వాతావరణ కేంద్రం లెక్కల ప్రకారం రెండురోజుల్లో పుజైరాలో కురిసిన వర్షం ఏకంగా 25.5 సెంటీమీటర్లుగా తెలుస్తోంది.దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.వందలాది దుకాణాలు, వాహనాలు నీటమునిగాయి.
రంగంలోకి దిగిన సహాయక బృందాలు, సైన్యం రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేశాయి.అయితే దేశంలోని కీలక నగరాలైన దుబాయ్, అబుదాబీలలో మాత్రం స్వల్పంగానే వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
అయితే భారీ వర్షం, వరదల కారణంగా ఏడుగురు ఆసియా సంతతి వ్యక్తులు మరణించినట్లు యూఏఈ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత దాదాపు 80 శాతం మందిని తిరిగి ఇంటికి చేర్చామని అధికారులు పేర్కొన్నారు.మరోవైపు రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం వున్నందున.ప్రజలు ఇళ్లు దాటి బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరించారు.మరోవైపు ఎప్పుడూ ఎండలతో సతమతమయ్యే యూఏఈలో అరుదుగా వరదలు చోటు చేసుకోవడంతో అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.