17వ పోలీస్ బెటాలియన్ దొడ్డి కొమురయ్య( Doddi Komaraiah ) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అసిస్టెంట్ కమాండెంట్ యమ్.
పార్థసారథి రెడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ మాట్లాడుతూతెలంగాణ సాయుధ పోరాట చరిత్ర( Telangana sayudha poratam )ని తలుచుకోగానే మొదటగా గుర్తుకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య అని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో ఒక సాధారణ గొర్రెల కాపరుల కుటుంబములో జన్మించిన కొమరయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆద్యుడవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం అన్నారు.
అప్పట్లో నిజాం పాలనలో తెలంగాణలోని గ్రామాల్లో జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు, భూస్వాములు, దేశ్ పాండేలు మొదలైన వారి దురాగతాల కారణంగా విసిగి వేసారిన ప్రజలకు ఆంధ్రమహాసభ కమ్యూనిస్టుల సంఘం ఒక దివిటీ లాగా కనిపించేదని దొడ్డి కొమరయ్య కూడా ఆంధ్రమహాసభ కమిటీ సభ్యుడిగా పనిచేసేవాడు.దొరల దురాగతాలు ఎదిరించడానికి ఆంధ్రమహాసభయే చక్కని వేదిక అని గ్రహించిన కొమరయ్య కూడా సంఘంలో చేరి దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవాడు.
జనగామ తాలూకాలో విసునూర్ దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి ఆధీనంలో ఉన్న 60 గ్రామాలలో ఒకటైన కడివెండి గ్రామంలో దేశ్ ముఖ్ రామచంద్రా రెడ్డి తల్లి దొరసాని అయిన జానకమ్మ ప్రజల పట్ల వ్యవహరించే తీరుకు ప్రజలంతా ఆమెను ఒక రాక్షసి లాగా భావించేవారని తెలిపారు.కడివెండి ప్రజలు ఆంధ్రమహాసభ (సంఘం) అండతో దొరసాని జానకమ్మకు పన్నులు చెల్లించడం ఆపేశారని.
దీంతో జానకమ్మకి అడ్డూ అదుపూ లేకుండా పోయి పన్ను చెల్లించడం ఆపిన వారిపైనా, ముఖ్యంగా జానకమ్మకు ఎదురొడ్డి నిలిచిన దొడ్డి కోమురయ్య కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు చేపట్టిందన్నారు.దేశ్ ముఖ్ అనుచరుడి ఆధ్వర్యంలో కొంత మంది గుండాలు కడవెండి గ్రామంలోకి ప్రవేశించి సంఘం కార్యకర్తలను రెచ్చగొడుతూ వారి ఇళ్ళ మీదికి రాళ్ళు రువ్వడం మొదలెట్టారు.
దీనికి ధీటుగా సంఘంలో గల ప్రజలు ఏకమై దొరలకు వ్యతిరేకంగా నినాదాలతో ర్యాలీగా బయల్దేరారు.వీరితో పాటు కొమరయ్య తన అన్న మల్లయ్యతో కల్సి ముందు వరుసలో నిల్చున్నాడు.
దేశ్ ముఖ్ కి సంబంధించిన ప్రైవేట్ రక్షణదళం ర్యాలీగా వస్తున్న ప్రజలను చూసి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే కాల్పులు జరపడంతో ముందు వరుసలో నిలుచున్న దొడ్డి కొమరయ్యకు పొట్టభాగంలో తూటాలు తగిలాయని కొమురయ్య అమరుడయ్యాడని తెలిపారు.కొమరయ్య మరణవార్తతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఆవేశపూరితులై కడివెండి గ్రామానికి చేరుకుని ప్రతీకార చర్యలకు పూనుకున్నారు.
శాంతియుతంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం తెలంగాణ సాయుధ విప్లవోద్యమంగా మారింది.తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరుడైన తొలి వ్యక్తి మరియు రైతుగా కొమరయ్య తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.