దేశ వ్యాప్తంగా ఎన్నికల జోరు ఊపందుకుంది , మండే ఎండల్లో కూడా పార్టీ ప్రచారం కోసం నేతలు , సినీ స్టార్స్ ప్రచారాలు భారీగా నిర్వహిస్తున్నారు.తమ ఓటు మా పార్టీ కే వేయాలని వారి మేనిఫెస్టో లో ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ ఓట్లు అడుగుతున్నారు రాజకీయ నాయకులు.
అయితే మన దేశం లో 1951-52లో తొలి సారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి , మరి ఆ ఎన్నికల్లో మొదటి ఓటు వేసి దేశంలోనే తొలి ఓటరుగా రికార్డుకెక్కింది ఎవరో తెలుసా.అతనే శ్యామ్ శరన్ నేగి , ఆయన గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు.

1.ఈయన 1917 జూలై 1 న హిమాచల్ ప్రదేశ్ లో కిన్నౌర్ జిల్లా లోని కల్పా అనే గ్రామం లో జన్మించాడు.
2.ఈయన హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసారు.
3.1951లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో ఆయన దేశంలో అందరికంటే ముందుగా ఓటువేసి భారత తొలి ఓటరుగా రికార్డుల్లోకి ఎక్కారు.

4.ఆ సంవత్సరం హిమాచల్ ప్రదేశ్ అంతటా ఎన్నికలు జరగబోతుండగా , కల్పా అనే ఊరిలో భారీగా మంచు కురవడం మొదలవ్వడంతో అక్కడ అన్ని ప్రాంతాల కన్నా ముందే పోలింగ్ నిర్వహించారు.
5.ప్రభుత్వ ఉపాధ్యాయుడైన శ్యామ్ శరన్ నేగి , ఎన్నికల విధుల్లో భాగంగా మరో ప్రాంతానికి వెళ్లాల్సి రావడంతో ముందుగా గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు వేసి బయలుదేరారు.దీంతో దేశంలో మొట్టమొదట ఓటుహక్కు వినియోగించుకున్న వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు.
6.ఈ విషయం 2007 వరకు దేశంలో ఎవరికీ తెలియదు.ఆ ఏడాది జూలైలో మనీశా నందా అనే ఐఏఎస్ అధికారి 90 ఏళ్లు పైబడిన ఓటర్ల గురించి వెతుకుతుండగా శ్యామ్ శరన్ నేగి గురించి తెలుసుకున్నారు.

7.అప్పటికి శ్యామ్ వయసు 92 సంవత్సరాలు.దాంతో మనీశా నందా , ఆయన గురించి వివరంగా తెలుసుకోవాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు.
8.కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ సుధా దేవి రంగంలోకి దిగారు.శ్యామ్ ఇంటికి వెళ్లి ఆరా తీయగా, ఆయన దేశంలోనే తొలి ఓటరని గుర్తించారు.దాదాపు నాలుగు నెలలపాటు పాత రికార్డులన్నీ తిరగేయగా శ్యామ్ మొదటి ఓటరుగా తేలింది.
9.ఈయన 1975వ సంవత్సరం లో తన ఉపాధ్యాయ వృత్తి నుండి పదవి విరమణ అందుకున్నాడు, ప్రస్తుతం శ్యామ్ శరన్ వయసు 102 సంవత్సరాలు.ఆయనకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.

10.శ్యామ్ శరన్ నేగి, 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు మొదలు ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కను వినియోగించుకున్న ఏకైక ఓటరుగా రికార్డులకెక్కారు.
ఈ లోక్సభ ఎన్నికల్లో మరోసారి ఓటువేసేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు శ్యామ్ శరన్, హిమాచల్ ప్రదేశ్లో మే 19న ఎన్నికలు జరగనున్నాయి.శ్యామ్ ఇతరులకు స్ఫూర్తినిస్తారనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనను బ్రాండ్ అంబాసీడర్గా నియమించింది.