2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో 150 సీట్లను సాధించి వైసిపి తన సత్తా చాటుకుని అధికారంలోకి వచ్చింది.ఆ ఫలితాలు జగన్ కు సంతృప్తిని ఇచ్చాయి.
ఆ ఉత్సాహంతోనే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, తాను పాదయాత్ర చేపట్టిన సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు వైసీపీ మేనిఫెస్టో అయిన నవరత్నాలను జగన్ అమలుచేసి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు.సంక్షేమ పథకాలే తనను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాయనే నమ్మకంతో ఉంటూ వచ్చారు.
అయితే ఎప్పటికప్పుడు పార్టీ వ్యవహారాల పైన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్న అభిప్రాయాలు వీటన్నిటి పైన జగన్ సర్వేలు చేయిస్తున్నారు.ఈ సర్వే నివేదిక ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
అయితే మొదట్లో వచ్చిన సానుకూలత ఇప్పుడు ప్రజల్లో కనిపించడం లేదు అనే రిపోర్టులు జగన్ కు టెన్షన్ కలిగిస్తున్నాయి.
ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు, జనసేన బలోపేతం అవుతుండడం , సంక్షేమ పథకాల విషయంలో ప్రజల్లో సానుకూలత ఉన్నా.
ఎమ్మెల్యేల తీరుపై పెరుగుతున్న వ్యతిరేకతను ఏ విధంగా తగ్గించాలనే విషయంలో జగన్ కంగారు పడుతున్నారు.గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజలకు వైసిపి ఎమ్మెల్యేలను దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నా ఆ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ ప్రజల్లో తమపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే విషయంపై ఎమ్మెల్యేలు అంతగా ఆసక్తి చూపించకపోవడం, చాలామంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటూ వ్యాపార వ్యవహారాల్లో మునిగితేలుతుండడం వంటివి జగన్ కు ఆగ్రహం కలిగిస్తున్నాయి.2024 ఎన్నికల్లో వైసిపి విజయం సాధించకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో జగన్ కు బాగా తెలుసు.

అందుకే తమ రాజకీయ ప్రత్యర్థులు బలపడకుండా తమ అధికారానికి ఎటువంటి డోకా లేకుండా చేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.అయితే జగన్ తపనను మంత్రులు , ఎమ్మెల్యేలు సరిగా అర్థం చేసుకోలేనట్టుగానే కనిపిస్తున్నారు.ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై నివేదికలను తెప్పించుకుంటూ వారికి వార్నింగ్ ఇస్తున్నా, చాలామంది వ్యవహారంలో ఏమాత్రం మార్పు కనిపించకపోవడం వంటివి జగన్ కు మంట పుట్టిస్తున్నాయి.
అందుకే పదే పదే పని తీరు సరిగా లేని మంత్రులు , ఎమ్మెల్యేలకు నేరుగా జగన్ వార్నింగులు ఇస్తున్నారు.ఇప్పుడు ఆ వార్నింగ్ లను మరింతగా పెంచారు.
స్వయంగా ఆ ఎమ్మెల్యేలు మంత్రుల పేర్లను బహిరంగంగా ప్రకటించి పద్దతి మార్చుకోవాలని హెచ్చరికలు చేస్తున్నారు.ఇక రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలు మంత్రులపై మరింత ఒత్తిడి పెంచే దిశగా జగన్ ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.2024 ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఇప్పటి నుంచే జగన్ అలెర్ట్ అవుతున్నా, ఆ స్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు అలర్ట్ కాకపోవడమే ఇబ్బందికరంగా మారింది.
.






