తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై చాలాకాలం నుంచి రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ చర్చ జరుగుతుంది.రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కుడా ఆయన వైఖరిలో మార్పు రాకపోవడం జనాల్లోకి పెద్ద రాకపోవడం, ప్రగతి భవన్ ను వీడి బయటకు వచ్చేందుకు పెద్దగా ఇష్టపడకపోవడం, ఎక్కువ కాలం ఫామ్ హౌస్ కి పరిమితం అయి పోవడం ఇలా ఎన్నో రకాల ఆయన తీరుపై విమర్శలు వస్తున్నాయి .
అయినా కెసిఆర్ మాత్రం తన వైఖరిని మార్చుకునేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.అయితే కెసిఆర్ జనాల్లోకి రాకపోయినా, జనాలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.
ప్రజలకు సంతృప్తికరమైన నిర్ణయాలు తీసుకుంటూ దానికి అనుగుణమైన పథకాలకు రూపకల్పన చేస్తూ వస్తున్నారు.అయినా ఆయన జనాల్లోకి రాకపోవడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యవహరించకపోవడంతో అందరూ కెసిఆర్ ను వేలెత్తి చూపిస్తున్నారు.ఇవే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం కలిసేందుకు ఆయన ఇష్టపడకపోవడం , కనీసం వారికి అపాయింట్మెంట్ దొరక్కపోవడం పై చాలా కాలంగా పార్టీ నేతల్లోనే అసంతృప్తి ఉంది.
ఇటీవలే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ వంటివారు ఈ విషయాల పై విమర్శలు చేశారు.మంత్రులు ఎమ్మెల్యేలు వంటి వారికి ముఖ్యమంత్రి దర్శనం దొరకకపోతే వివిధ సమస్యలను చెప్పాలనుకున్న వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇక ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు సంబంధించి తమ బాధను చెప్పుకునేందుకు , నిధులు ఇతర అంశాలపై అధినేత కేసీఆర్ తో చర్చించేందుకు అవకాశం దొరకడం లేదు.
దీంతో సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి కనిపిస్తోంది.
తన వైఖరి కారణంగా జరుగుతున్న నష్టం గురించి కేసీఆర్ కు తెలిసినా, మౌనంగానే ఉండిపోతున్నారు తప్ప, తన వైఖరి మార్చుకునేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.ఈ పరిణామాలు ముందు ముందు పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది అని, దీని కారణంగా ఎంతో నష్ట పోవాల్సి వస్తుందనే ఆందోళన పార్టీ నేతల్లో కనిపిస్తోంది.