ప్రధాని మోదీ భీమవరం పర్యటనకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దూరంగా ఉన్నారు.తొలుత ఆయన భీమవరం రావాలని ప్రయత్నించారు.
ఈ మేరకు హైదరాబాద్ లింగంపల్లి నుంచి రైలులో బయలుదేరారు.అయితే రైలులో తన వ్యతిరేక వర్గం భారీగా ఎక్కిందని తెలుసుకుని బేగంపేటలో దిగిపోయి ఇంటికి వెళ్లిపోయారు.
మరోవైపు ఆయనకు బీజేపీ ప్రాధాన్యం ఇవ్వలేదని.కనీసం ప్రోటోకాల్ జాబితాలో ఆయన పేరును కూడా చేర్చలేదని స్థానిక పోలీసులు వెల్లడించడం హాట్ టాపిక్గా మారింది.
దీంతో ప్రధాని మోదీ కూడా ఎంపీ రఘురామను పట్టించుకోలేదని ప్రచారం జరుగుతోంది.ఇటీవల కాలంలో రఘురామ వైసీపీలో రెబల్ ఎంపీగా ఉంటున్నారు.ఆయన నిత్యం వైసీపీపై విమర్శలు చేస్తున్నారు.బీజేపీకి సన్నిహితంగా ఉంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగాలని సన్నాహాలు చేసుకుంటున్నారు.అయినా ఇప్పుడు బీజేపీ ఆయన్ను పట్టించుకోకపోవడం ఏంటని ఆయన సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు.
అయితే రఘురామను బీజేపీ పక్కన పెట్టడానికి కారణం జగన్ వ్యూహమని తెలుస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ మద్దతు కీలకంగా మారింది.తనకు రఘురామ వ్యతిరేకంగా ఉండటంతో ఆయన భీమవరం రావడానికి జగన్ ఎంత మాత్రం ఇష్టపడలేదని.అందుకే బీజేపీ కూడా జగన్ మాటను గౌరవించి రఘురామ పేరును ప్రోటోకాల్ జాబితాలో చేర్చలేదని తెలుస్తోంది.
అటు రఘురామకు వైసీపీలోని క్షత్రియ సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం లేదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
అటు రఘురామ భీమవరం వెళ్లకపోవడమే మంచిదైందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.ఒకవేళ భీమవరం వెళ్లి ఉంటే కీడు జరిగి ఉండేదని టీడీపీ అనుమానిస్తోంది.రఘురామనుహత్య చేయడానికి అధికార పార్టీ ప్లాన్ చేసిందని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు.
నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో ఎంపీ రఘురామ భీమవరం వచ్చుంటే ఆయనకు అదే చివరి రోజు అయ్యేదని సంచలన ఆరోపణ చేశారు.రైలులో ఉండగా దాడి చేస్తారనే సమాచారం రాగానే రఘురామ బేగంపేటలో దిగిపోయి ప్రాణాలు కాపాడుకున్నారని బోండా ఉమ చెప్పుకురావడం గమనార్హం.