వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అఖండ మెజారిటీతో మళ్ళీ విజయం సాధిస్తుందనే ధీమాతో ఉన్నారు.ఇప్పటివరకు ఏ ప్రభుత్వం తమ మాదిరిగా సంక్షేమ పథకాలను అమలు చేయలేదని, అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించే కార్యక్రమం చేపట్టలేదని జగన్ బలంగా నమ్ముతున్నారు.
సంక్షేమ పథకాలకు ఎటువంటి లోటు లేకుండా ప్రజలకు అందించామని, అలాగే సామాజిక వర్గాల వారీగాను అందరికీ రాజకీయంగా పదవుల్లో ప్రాధాన్యం కల్పించామని, ఇవన్నీ తమకు కలిసి వస్తాయని జగన్ లెక్కలు వేసుకుంటున్నారు.
అందుకే 175 స్థానాల్లోనూ వైసీపీ గెలుస్తుందనే ధీమా ను వ్యక్తం చేయడంతో పాటు, పార్టీ నాయకులకు దీనిపై భరోసా ఇస్తూ, వారిని మరింత యాక్టివ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజాప్రతినిధులందరిని జనాల్లోకి పంపుతున్నారు.వీరితో పాటు అధికారులు వెళ్తున్నారు.
వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కుటుంబానికి ఎంత మేర లబ్ధి చేకూరిందో వివరించే ప్రయత్నం చేస్తూనే .ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు , ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించే విధంగా జగన్ ఈ కార్యక్రమాన్ని రూపొందించి ముందుకు వెళ్తున్నారు.అయినా జగన్ జనాల్లోకి రావడం లేదని, ఎక్కువగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితం అవుతున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
దీంతో పాటు ఎన్నికలకు సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో జగన్ జనాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయిపోయారు.వచ్చే నెల నుంచి పల్లె నిద్ర పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించబోతున్నారు.ఇప్పటి వరకు నాయకులు , అధికారులు మాత్రమే పల్లెనిద్ర చేపట్టేవారు.ఇప్పుడు జగన్ కూడా పల్లెనిద్రలు చేయాలని నిర్ణయించుకున్నారు.ఉగాది నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ప్రతి వారంలో మూడు రోజుల పాటు ఖచ్చితంగా పల్లెలో నిద్రించాలని జగన్ నిర్ణయించుకున్నారు.దీని ద్వారా ఆయా గ్రామాల్లోని సమస్యలు పరిష్కారం కావడమే కాకుండా, జనాల్లో జగన్ మమేకమవుతున్నారనే సంకేతాలు అందరికీ వెళ్తాయని , ఇది పార్టీకి , తనకు మేలు చేస్తుందని జగన్ భావిస్తున్నారట.