పార్టీలో తమకు పదవులు దక్కినా, దక్కకపోయినా పార్టీ కోసం, అధినేత కోసం త్యాగాలు చేసేందుకు ఏమాత్రం వెనకాడని నేతలు చాలా అరుదుగా ఉంటారు.ప్రస్తుత రాజకీయాల్లో అటువంటి నేతలను వేళ్ళ మీద లెక్క పెట్టుకోవాల్సిందే.
ఏపీ అధికార పార్టీ వైసీపీలోను అటువంటి నాయకుడు ఒకరు ఉన్నారు.ఆయనే చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్.2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా చిలకలూరిపేట నుంచి మర్రి రాజశేఖర్ పోటీ చేస్తారని అంతా భావించారు.జగన్ సైతం రాజశేఖర్ కి టికెట్ ఇస్తున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.
అయితే చివరి నిమిషంలో అనూహ్యంగా టిడిపి నుంచి వైసీపీలో చేరిన ప్రస్తుత మంత్రి విడదల రజనీకి చిలకలూరిపేట టిక్కెట్ ను జగన్ కేటాయించారు.
ఆ సమయంలో రాజశేఖర్ అసంతృప్తి కి గురి కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చి , మంత్రిగా అవకాశం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.
అయితే ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగేళ్లు అవుతున్నా, ఇప్పటివరకు ఆ హామీని జగన్ నెరవేర్చలేదు.అయినా మర్రి రాజశేఖర్ ఎక్కడ తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయలేదు.
అయితే ఇటీవల కాలంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నట్టుగా వ్యవహరిస్తున్నారు.రాజశేఖర్ విషయంలో అన్యాయం జరుగుతుందని గుర్తించిన జగన్ ఇప్పుడు ఆయన ప్రాధాన్యాన్ని పెంచేశారు.
గతంలో వైసిపి జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన మర్రి రాజశేఖర్ ను ఇప్పుడు వైసిపి ఉమ్మడి కృష్ణాజిల్లా కోఆర్డినేటర్ గా జగన్ నియమించారు .ఈ పదవి తరువాత రాజశేఖర్ బాగా యాక్టివ్ అయ్యారు.సొంత జిల్లాలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.సమన్వయ కమిటీ సమావేశాలకు హాజరవుతున్నారు.ఒక్కసారిగా మర్రి రాజశేఖర్ దూకుడు పెంచడం వెనక జగన్ హామీలు ఉన్నాయట.ఈసారి ఎమ్మెల్సీ ఖాళీల భర్తీ సమయంలో తప్పకుండా అవకాశం ఇస్తామని జగన్ మర్రి కి హామీ ఇచ్చారట.
ఒకవేళ ఎమ్మెల్సీగా అవకాశం రాకపోతే 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా రాజశేఖర్ వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు.అయితే అక్కడ మంత్రి విడదల రజిని వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నారు.అయితే రాజశేఖర్ కు అక్కడ అవకాశం ఇవ్వాలనుకుంటే విడుదల రజిని ని గుంటూరు లేదా సత్తెనపల్లి నుంచి పోటీ చేయించే ఆలోచనలలో జగన్ ఉన్నారట.ఏది ఏమైనా జగన్ పై నమ్మకంతో ఇప్పటివరకు పదవులు రాకపోయినా వేచి చూస్తున్న మర్రి రాజశేఖర్ కు కీలకమైన పార్టీ పదవితో పాటు , ఎమ్మెల్సీ గానూ లేదా ఎమ్మెల్యే అభ్యర్థిగాను అవకాశం దక్కబోతుండడంతో మర్రి వర్గీయులు తెగ ఆనంద పడిపోతున్నారట.