కెనడాలో ఇప్పటికే స్థిరపడిన.విద్య, వృత్తి, ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులకు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
ఆ దేశంలో విద్వేషనేరాలు, హింస పెరుగుతున్న నేపథ్యంలో నిత్యం అప్రమత్తంగా వుండాలని అడ్వైజరీ జారీ చేసింది.ఈ మేరకు భారత విదేశాంగ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
విద్వేష నేరాలకు పాల్పడిన వారిపై కెనడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విదేశాంగ శాఖ పేర్కొంది.అలాగే కెనడాలోని భారత హైకమీషన్ కూడా విద్వేషనేరాలకు పాల్పడుతోన్న వారిపై చర్యలు తీసుకునేలా స్థానిక యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొస్తోందని కేంద్రం తెలిపింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో కెనడాలో స్థిరపడిన భారతీయ పౌరులు, వివిధ పనులపై వెళ్లిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.ఒట్టావాలోని ఇండియన్ హైమీషన్తో పాటు టొరంటో, వాంకోవర్లలో వున్న ఇండియన్ కాన్సూలేట్ కార్యాలయాలను సంప్రదించడంతో పాటు వెబ్సైట్లలో తమ వివరాలను నమోదు చేసుకోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు ఉపయోగపడుతుందని విదేశాంగ శాఖ సూచించింది.
ఇకపోతే.ఇటీవల కెనడాలో ఖలిస్తాన్ మద్ధతుదారులు రెచ్చిపోయారు.ఏకంగా హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసి.ఆలయ గోడలపై భారత్కు వ్యతిరేకంగా పిచ్చిరాతలు రాశారు.ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.టొరంటోలోని బీఏపీఎస్ స్వామి నారాయణ్ మందిరంలో ఈ ఘటన జరిగింది.
దీనికి సంబంధించి కెనడాలోని భారత హైకమీషన్ బుధవారం ట్విట్టర్ ద్వారా స్పందించింది.భారత వ్యతిరేక గ్రాఫిటీతో స్వామి నారాయణ్ మందిర్ను అపవిత్రం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కమీషన్ తెలిపింది.
ఈ ఘటనపై విచారణ జరిపి నేరస్తులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను భారత హైకమీషన్ కోరింది.
ఇండో కెనడియన్ పార్లమెంట్ సభ్యుడు చంద్ర ఆర్యా కూడా ఈ ఘటనపై స్పందించారు.టొరంటోని స్వామి నారాయణ్ మందిరాన్ని ధ్వంసం చేయడాన్ని అందరూ ఖండించాలని ఆయన కోరారు.ఇటీవలి కాలంలో కెనడాలోని హిందూ దేవాలయాలను ద్వేషపూరిత నేరాలకు లక్ష్యంగా చేసుకున్నారని చంద్ర ఆర్యా ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రాంప్టన్ సౌత్ పార్లమెంట్ సభ్యురాలు సోనియా సిద్ధూ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.