కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.కళ్ల ముందే చాలా మంది తమ కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయారు.
చివరికి కడచూపు కూడా దక్కకుండానే ఆసుపత్రి నుంచి ప్రభుత్వమే వారిని శ్మశానాలకు తరలించి, అంత్యక్రియలు చేసిన పరిస్థితి తలెత్తింది.పవిత్ర గంగానది ఒడ్డున వందల సంఖ్యలో మృతదేహాల ఖననం కరోనా పరిస్థితులకు అద్దం పడుతుంది.
ఇటువంటి విషమ పరిస్థితులలో చాలా మంది లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలను కోల్పోయారు.అయితే కొందరు దానిని కూడా తమకు అవకాశంగా మలుచుకుని, కొత్త కొత్త వ్యాపారాలతో నిలదొక్కుకున్నారు.
ఓ ముగ్గురు కేరళ యువకులు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలపోవడంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి, విజయవంతంగా ముందుకు సాగుతున్నారు.వారికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
చాలా కంపెనీలు కరోనా లాక్ డౌన్ సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులను తొలగించాయి.అధిక-నైపుణ్యం, అనుభవజ్ఞులైన టెక్కీలతో సహా చాలా మందికి కూడా పింక్ స్లిప్ ఇచ్చారు.
చాలా మందికి ఉద్యోగాలను కొనసాగించాలంటే వారి జీతంలో భారీగా కోత విధించారు.ఇదే తరహాలో తమ జీవనోపాధిని కోల్పోయిన భారతదేశంలోని వేలాది మంది టెక్కీలలో కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన ఆనంద్, మహమ్మద్ షఫీ, అతని సోదరుడు షానవాస్ అనే ముగ్గురు యువకులు ఉన్నారు.
తమ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ రోజుల్లో క్లాస్మేట్స్గా ఉన్న ఆనంద్, షఫీ లాక్డౌన్లో వారి ఉద్యోగాలను కోల్పోయారు.అంతకు ముందు కేరళలోని అనేక టెక్ కంపెనీలలో పని చేసిన అనుభవం వారికి ఉంది.
మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన షానవాస్ లాక్డౌన్కు ముందు మిడిల్ ఈస్ట్, గుజరాత్లోని సంస్థలలో పనిచేశాడు.లాక్డౌన్ పెట్టగానే ఉద్యోగాలు తక్కువగా లభిస్తుండడంతో వారు నిరాశపడ్డారు.
అయితే కొంత కాలానికి వారు ఉద్యోగం కోసం అన్వేషణను ముగించి వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.అలా పుట్టిందే ‘బీ టెక్ చాయ్‘.
కొల్లాంలో రద్దీగా ఉండే ప్రాంతంలో 2021 అక్టోబర్లో ఈ టీస్టాల్ను ప్రారంభించారు.
ఈ టీ స్టాల్ స్థానికులలో ఇప్పటికే విజయవంతమైంది.ముగ్గురు ఇంజనీర్లు టీ అమ్మడం వల్లనే కాదు, వారు ప్రవేశపెట్టిన ప్రత్యేకమైన రుచుల కోసం చాలా మంది క్యూ కడుతున్నారు.ఇక్కడి ఛాయ్ మెనూలో అసోం టీ, మౌంటెన్ బటర్ టీ, డార్జిలింగ్ టీ, కశ్మీరీ కహ్వా వంటి 100కు పైగా రుచులు ఉండే టీలు ఉన్నాయి.వాటి ధర రూ.9 నుంచి మొదలై రూ.49 వరకు ఛార్జ్ చేస్తున్నారు.మొదట్లో వీరిని కుటుంబ సభ్యులే తిట్టారు.
బాగా చదువుకుని టీ అమ్మడం ఏంటని నిలదీశారు.అయితే వారందరికీ తమ వ్యాపారాన్ని విజయవంతం చేసి, అంతా అవాక్కయ్యేలా చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ ఔట్లెట్లను వారు విస్తరిస్తున్నారు.రూ.1.5 లక్షలతో ప్రారంభించిన వీరి బిజినెస్ ప్రస్తుతం ఏడాదికి రూ.36 లక్షల టర్నోవర్ దాటింది.ఖర్చులు పోను వీరికి ఏటా రూ.20 లక్షలు మిగులుతోంది.త్వరలో తమ వ్యాపారాన్ని విస్తరిస్తుండడంతో ఆ లాభాలు కోట్లలో ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు.