తెలంగాణ లోని రాజకీయ పరిస్థితులను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది అధికార పార్టీ బీఆర్ఎస్.ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో, ఆ ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొని మళ్లీ మూడోసారి బీర్ఎస్ ను అధికారంలోకి తీసుకువచ్చే విషయంపైనే దృష్టి సారించింది.
ఈ మేరకు పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలు, నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా పై బీఆర్ఎస్ అగ్ర నేతలు దృష్టి సారించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు ఉన్నంత స్థాయిలో బీ ఆర్ ఎస్ కు బలం లేకపోవడంతో, ఇక్కడే ప్రధానంగా దృష్టి సారిస్తోంది.అయితే బిఆర్ఎస్ లో కీలక నాయకుడుగా ఉన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడం, ఖమ్మం పార్లమెంట్ పరిధి లోని అన్ని నియోజకవర్గాల్లోనూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులు, కీలక నాయకులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తుండడం వంటివి బిఆర్ఎస్ అగ్ర నాయకులకు ఆందోళన కలిగిస్తోంది.
.పొంగులేటి బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుండడంతో , ఆయన వెంట పార్టీ కేడర్ ఎవరూ వెళ్లకుండా ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టింది.ఈ మేరకు పార్టీ నాయకులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చేందుకు విస్తృతంగా సమావేశాలు నిర్వహించి, పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపాలని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని , రాబోయే 15 రోజుల్లో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది.ఈ మేరకు ఆ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సమావేశమై ఈ విషయంపై చర్చించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అలాగే ప్రజా ప్రతినిధుల సదస్సు నిర్వహించాలని శ్రీనివాస్ రెడ్డి వెంట ఎవరు వెళ్లకుండా చూడాలని టార్గెట్ ను విధించారు .పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదనే కారణంతోనే శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు .వైరా మున్సిపల్ చైర్మన్ సుతకాని జైపాల్, మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ వంటి వారిపై ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది.మిగతా నాయకులపైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
పొంగులేటి వెంట ఎవరు వెళ్ళినా ఇదే పరిస్థితి తలెత్తుతుందని , వారి రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడుతుందనే సంకేతాలను ఇవ్వడం ద్వారా, పొంగులేటి దూకుడు ను తగ్గించాలని బీఆర్ఎస్ అధిష్టానం డిసైడ్ అయ్యిందట.