దక్షిణాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడింది బ్రిటన్.లక్షలాది కేసులు, వందల్లో మరణాలతో ఇంగ్లీష్ గడ్డ వణికిపోయింది.
ప్రజలను వైరస్ నుంచి రక్షించేందుకు మరోసారి ఆంక్షలు విధించడంతో పాటు వేగంగా బూస్టర్ డోస్ను వేసింది.కేసులు విపరీతంగా వస్తున్నా భయపడకుండా పోరాటం కొనసాగించింది.
ఈ చర్యలు ఫలించి ఇప్పుడిప్పుడే బ్రిటన్ కోలుకుంటోంది.గడిచిన కొన్ని రోజులుగా యూకేలో కేసులు తగ్గుతూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో యూకేలో ఆంక్షలను ఉపసంహరించి, ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణం కలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీనిలో భాగంగా వచ్చే గురువారం నుంచి ఈ ఆంక్షలను ఎత్తివేస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
అంతే కాదు వచ్చే వారం నుంచి ప్రజలు మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని ఆయన వ్యాఖ్యానించారు.దేశంలో ఒమిక్రాన్ అదుపులోకి వచ్చినట్లు నిపుణులతో పాటు పలు అధ్యయనాలు చెబుతున్నందున ఆంక్షల ఎత్తివేత దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై బోరిస్ జాన్సన్ గురువారం హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రకటన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
యూకేలో ఒమిక్రాన్ పీక్స్ స్టేజ్ను అధిగమించిందని ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ONS) తాజా గణాంకాలు చెబుతున్నాయని ప్రధాని తెలిపారు.దీనిని బట్టి ఆంక్షలను సడలించి తక్కువ నిబంధనలను అమలు చేసుకోవచ్చన్నారు.
వచ్చే గురువారం నుంచి వర్క్ ఫ్రమ్ హోంలు, మాస్క్లు ధరించడం, భారీ సభలు, సమావేశాల్లో పాల్గొనేందుకు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ వంటివి తప్పనిసరి కాదని బోరిస్ జాన్సన్ వెల్లడించారు.
బ్రిటన్ ప్రజలపై తమకు నమ్మకం ఉందని… వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా రద్దీ ప్రదేశాల్లో ప్రజలు స్వచ్ఛందంగా మాస్క్లు ధరిస్తారని, భౌతిక దూరం పాటిస్తారని ఆయన ఆకాంక్షించారు.అలాగే మాస్క్ ధరించని వారిపై చర్యలు తీసుకోమని ప్రధాని చెప్పారు.అయితే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయితే మాత్రం సెల్ఫ్ ఐసోలేషన్ వంటి నిబంధనలు మాత్రం అమల్లోకి ఉంటాయని బోరిస్ జాన్సన్ తెలిపారు.