ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.రాబోయే ఎన్నికల్లో ఏ ఏ పార్టీలు పొత్తులతో కలిసి వెళ్తాయి.
ఏ ఏ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తాయనే విషయంలో సందిగ్ధం నెలకొంది.ప్రస్తుతం జనసేన, బీజేపీలు పొత్తు కొనసాగిస్తుండగా, రాబోయే ఎన్నికల్లో తాము ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేసి 2019 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేస్తామని అధికార పార్టీ వైసిపి ( YCP ) చెబుతోంది.
ఇక టిడిపి 2019 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.దీంతో మరోసారి ఒంటరిగా వెళ్లేందుకు ఆ పార్టీ సాహసం చేయలేకపోతోంది.
దీంతో జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకుని వైసీపీని ఓడించాలనే లక్ష్యాన్ని టిడిపి పెట్టుకుంది.ఈ విషయంలో జనసేన, టిడిపి తో కలిసి వస్తున్నా, బిజెపి మాత్రం దూరం దూరంగానే ఉంటుంది.
ఇప్పటికే అనేకసార్లు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ( Chandrababu Naidu ) బిజెపితో పొత్తు అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూనే వస్తున్నారు.అలాగే టీడీపీ తో పొత్తు పెట్టుకుంటే ఉమ్మడిగా అధికారంలోకి రావచ్చు అనే ప్రతిపాదనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) సైతం బిజెపి వద్ద ఢిల్లీకి వెళ్లి మరి ప్రస్తావించారు.

దీనిపై బిజెపి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.అయినా చంద్రబాబు మాత్రం పొత్తులపై ఆశలతోనే ఉన్నారు.తాజాగా ఇదే అంశంపై చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్( MP CM Ramesh ) ఈ పొత్తుల అంశంపై తాజాగా స్పందించారు.రాబోయే ఎన్నికల తర్వాత ఏపీలో బిజెపి భాగస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎం రమేష్ అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో తమ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో అన్ని విషయాలు చర్చించారని, నడ్డాతో చర్చించిన తర్వాత పవన్ క్లారిటీతో ఉన్నారని రమేష్ పేర్కొన్నారు.

జనసేన బీజేపీతోనే ఉందని రమేష్ క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం సీఎం రమేష్ వ్యాఖ్యలు బట్టి టిడిపి తో పొత్తుకు బిజెపి సిద్ధంగా ఉందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి టిడిపిని కలుపుకు వెళ్లే విషయంలో చర్చలు సఫలమయ్యాయనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.అందుకే సీఎం రమేష్ ఈ విధమైన వ్యాఖ్యలు చేసి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి.







